
జామాయిల్ తోటల్లో పరిశీలన
ఉదయగిరి: మండలంలోని తిరుమాలపురం రెవెన్యూలో సర్వే నంబరు 139, 140, 145ల్లో అగ్రిగోల్డ్ భూముల్లో సాగులో ఉన్న జమాయిల్ తోటను బుధవారం సీఐడీ అధికారులు పరిశీలించారు. మంగళవారం జామాయిల్ కలపను నరికి అక్రమంగా తరలించే ప్రయత్నం చేయడం తెలిసిందే. ఈక్రమంలో సీఐడీ అధికారులు రెవెన్యూ అధికారులతో కలిసి భూములు గుర్తించి సర్వే చేశారు. సీఐడీ అధీనంలో ఉన్న భూముల్లో అక్ర మంగా ప్రవేశించి చెట్లు నరికి తరలిస్తున్న వ్యక్తులను గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు తసుకోవాల్సిందిగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కలప తరలించేందుకు సిద్ధంగా ఉంచిన వాహనాలను సీజ్ చేయాల్సిందిగా సూచించారు. ఈ వ్య వహారం వెనుక కీలక వ్యక్తిగా ఉన్న నేలటూరుకు చెందిన ఇత్తడి శ్రీను పాత్రపై పోలీసులు విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో సీఐడీ సీఐ రాజేష్కుమార్, ఎస్సై రాజు, సిబ్బంది ఉన్నారు.
సినిమా థియేటర్లలో తనిఖీలు
కోవూరు/బుచ్చిరెడ్డిపాళెం రూరల్: కోవూరులోని రెండు థియేటర్లను నెల్లూరు ఆర్డీఓ నాగఅనుష, బుచ్చిరెడ్డిపాళెంలోని జమీలా, నాజ్ థియేటర్లను తహసీల్దార్ అంబటి వెంకటేశ్వర్లు బుధవారం తనిఖీ చేశారు. పార్కింగ్, టాయిలెట్లు పరిశీలించారు. పార్కింగ్కు అధిక ఫీజు వసూలు చేస్తే చర్యలు తప్పవని థియేటర్ నిర్వాహకులను హెచ్చరించారు. తినుబండారాల విక్రయించే స్టాల్ వద్ద ధరల పట్టిక లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరల పట్టిక కచ్చితంగా ఏర్పాటు చేయాలని సూచించారు. నాజ్ థియేటర్లో టాయిలెట్లు సరిగా లేవని, టికెట్ల ధరల విషయంలో అధికంగా వసూలు చేస్తే ఉపేక్షించేది లేదన్నారు. ఆర్డీఓ వెంట కోవూరు తహసీల్దార్ నిర్మలానంద బాబా, ఆర్ఐ, వీఆర్ఓ ఉన్నారు.
●ఆత్మకూరు: పట్టణంలోని సినిమాహాళ్లను ఆర్డీఓ బి పావని రెవెన్యూ సిబ్బందితో కలిసి బుధవారం ఆకస్మిక తనిఖీలు చేశారు. సినిమా హాళ్ల పరిసరాలను, పరిశుభ్రతను పరిశీలించారు. ప్రేక్షకులకు తాగునీరు వసతితో పాటు మరుగుదొడ్ల సౌకర్యం తప్పనిసరిగా నిర్వహించాలని సూచించారు. ఆమె వెంట డీటీ స్వరూప్, సీనియర్ అసిస్టెంట్ కొండయ్య, లక్ష్మణ ఉన్నారు.
31న పింఛన్ల పంపిణీ
నెల్లూరు (పొగతోట): సామాజిక పింఛన్ల పంపిణీ ప్రక్రియ ఈ నెల 31వ తేదీన చేపట్టాలని డీఆర్డీఏ పీడీ నాగరాజకుమారి ఎంపీడీఓలను ఆదేశించారు. బుధవారం డీఆర్డీఏ కార్యాలయం నుంచి డీఎల్పీఓలు, మున్సిపల్ కమిషనర్లు, వివిధ మండలాల ఎంపీడీఓలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్లో ఆమె మాట్లాడారు. జూన్ 1వ తేదీ ఆదివారం కావడంతో ఒక్క రోజు ముందుగానే పింఛన్ల పంపిణీకి చర్యలు తీసుకోవాలన్నారు.
పదోన్నతులు, బదిలీల్లో గందరగోళం
● రాత్రి 8 తర్వాత రేపటికి వాయిదా
నెల్లూరు (టౌన్): ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ గందరగోళంగా మారింది. ఎస్ఏలకు పదోన్నతుల ప్రక్రియ నగరంలోని దర్గామిట్ట జిల్లా పరిషత్ హైస్కూల్లో చేపట్టారు. ఈ జాబితా ప్రకారం జెడ్పీ 89, మున్సిపాలిటీ 4, ప్రభుత్వ స్కూల్స్ల్లో 8 మంది ఎస్ఏలకు పదో న్నతులు కల్పించనున్నారు. హెచ్ఎంలుగా నియ మించేందుకు 1ః3 నిష్పత్తిలో స్కూల్ అసిస్టెంట్లను పిలిచారు. అయితే హెడ్మాస్టర్లు పదోన్నతుల్లో భాగంగా జిల్లా విద్యాశాఖ అధికారులు రోస్టర్ జాబితాను రూపొందించలేదు. బదిలీల కోసం ఆప్షన్లు పెట్టుకున్న హెడ్మాస్టర్లకు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ నుంచి ఆయా స్థానాల కేటాయింపు జాబితా రావాల్సి ఉంది. రోస్టర్ కం రిజర్వేషన్ పద్ధతిలో పదోన్నతులు కల్పించి, ఆయా స్థానాలు కేటాయించాల్సి ఉంది. రోస్టర్ కం రిజర్వేషన్ జాబితాను తయారు చేయకపోవడం, బదిలీల కోసం ఆప్షన్లు పెట్టుకున్న హెడ్మాస్టర్లకు స్థానాలు కేటాయించకపోవడంతో రాత్రి 8 గంటల తర్వాత ఈ ప్రక్రియను గురువారానికి వాయిదా వేస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారులు ప్రకటించారు.

సినిమా థియేటర్లలో తనిఖీలు