
అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదు
వెంకటాచలం/నెల్లూరు(స్టోన్హౌస్పేట): కూటమి ప్రభుత్వం పెట్టే అక్రమ కేసులకు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు భయపడే ప్రసక్తే లేదని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి, మాజీమంత్రి అనిల్కుమార్ యాదవ్ అన్నారు. అక్రమ కేసులతో జిల్లా జైల్లో ఉన్న మాజీమంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డిని బుధవారం వీరు వేర్వేరుగా ములాఖత్ ద్వారా కలిశారు. అనంతరం జైలు వద్ద వీరు విలేకరులతో మాట్లాడారు. రెడ్బుక్ రాజ్యాంగంలో భాగంగా మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డిని కూటమి ప్రభుత్వం జైల్లో పెట్టించిందని విమర్శించారు. ఇలాంటి ఎన్ని కుట్రలు చేసినా భయపడబోమని, రెట్టింపు ఉత్సాహంతో వైఎస్సార్సీపీ శ్రేణులు జిల్లాలో పని చేస్తాయన్నారు. ఈ కేసుల్లో కాకాణికి ఎలాంటి సంబంధం లేదని, కక్ష పూరితంగానే ఇరికించారన్నారు. మైన్స్ కేసుకు సంబంధించి గత ప్రభుత్వంలోనే విచారణ జరిగి ఎలాంటి అక్రమాలు చోటు చేసుకోలేదని అధికారులు రిపోర్టులు ఇచ్చినప్పటికీ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలతో కేసు నమోదు చేసిందన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో ప్రశ్నిస్తున్న గొంతును నొక్కాలనే ప్రభుత్వం ఈ అక్రమ కేసు బనాయించిందన్నారు. ఈ కేసులో కాకాణి క్లీన్చిట్తో బయటకు వస్తారని తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధిని విస్మరించి, వైఎస్సార్సీపీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులను కేసుల్లో ఇరికించి, జైలు పాలు చేయాలనే కుట్రలు చేయడం సిగ్గు చేటని విమర్శించారు. అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపినా కాకాణి ధైర్యం కోల్పోలేదని చెప్పారు. జిల్లాలో ప్రజల పక్షాన చేసే పోరాటాలపై తమతో చర్చించారని చెప్పారు. జూన్ 4వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్సీపీ నిర్వహించే వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతం చేసేలా చూడాలని తెలియజేశారన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు, కార్పొరేటరు ఊటుకూరు నాగార్జున, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు అశ్రిత్రెడ్డి, 4, 16 డివిజన్ ఇన్చార్జిలు సంధాని, సగిలి జయరామిరెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు సింగంశెట్టి అశోక్, అస్లాం, కొండయ్య, శేఖర్, పెంచలయ్య, వెంకటేష్, ప్రసన్న, చంద్ర తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ చంద్రశేఖర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్కుమార్రెడ్డి, మాజీ మంత్రిఅనిల్కుమార్యాదవ్

అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదు