
అండగా ఉన్నాం.. భయపడొద్దు
● మాజీ ఎమ్మెల్యే విక్రమ్రెడ్డి, రాజగోపాల్రెడ్డి
● కాకాణి కుటుంబ సభ్యులకు పరామర్శ
నెల్లూరు(స్టోన్హౌస్పేట): కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతిపక్ష నాయకులను ఇబ్బందులు పెట్టే విధంగా పాలన సాగిస్తున్నారని, వైఎస్సార్సీపీలో అందరం ఐక్యంగా ఉండి కూటమి దుష్ట రాజకీయాలను అడ్డుకుంటామని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్రెడ్డి అన్నారు. బుధవారం ఉదయగిరి నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డితో కలిసి నెల్లూరు డైకస్రోడ్డులోని మాజీమంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి నివాసంలో వారి కుటుంబ సభ్యులను కలిసి ధైర్యం చెప్పారు. కూటమి హామీలు అమలు చేయాలని ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు పెడుతూ రెడ్బుక్ పాలన సాగిస్తున్నారన్నారు. అక్రమ కేసులో కాకాణిని అరెస్ట్ చేయడం జరిగిందని, ప్రజల పక్షాన నిలిచే అలాంటి వ్యక్తి ఇలాంటి కేసులకు భయపడరని, తామంతా ఉన్నామన్నారు. కాకాణికి కోర్టులో తప్పకుండా న్యాయం జరుగుతుందన్నారు. ఆయనపై పెట్టిన అక్రమ కేసుల నుంచి తప్పకుండా బయటకు వస్తారన్నారు. వైఎస్సార్సీపీ నాయకులకు ఇబ్బందులకు గురి చేస్తున్న కూటమి ప్రభుత్వ పాలనను ప్రజలంతా గమనిస్తున్నారన్నారు.