
రైల్లో గంజాయి తరలిస్తుండగా..
నెల్లూరు(క్రైమ్): టాటానగర్ – ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ రైలులో అక్రమంగా తరలిస్తున్న 7.7 కేజీల గంజాయిని నెల్లూరు రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకుని ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. బుధవారం రైల్వే సీఐ ఎ.సుధాకర్ నెల్లూరులోని కార్యాలయంలో వివరాలను వెల్లడించారు. రైళ్లలో మత్తు, మాదకద్రవ్యాల అక్రమరవాణా కట్టడికి రైల్వే పోలీసులు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా కావలి, నెల్లూరు, గూడూరు రైల్వే పోలీసులు బృందాలుగా ఏర్పడి ఒడిశా నుంచి చైన్నె, కర్ణాటక వెళ్లే రైళ్లలో తనిఖీలు చేపట్టారు. నెల్లూరు రైల్వేస్టేషన్లో సీఐ, ఎస్సై హరిచందనలు టాటానగర్ – ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ రైల్లోని జనరల్ బోగీలో తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పదంగా ఉన్న తమిళనాడు రాష్ట్రం తంజావూరు జిల్లా మదుకూరు ప్రాంతానికి చెందిన ఎస్.మొహమ్మద్ సమీర్, గుణశేఖర దిపక్, కర్ణాటక రాష్ట్రం చిక్మగళూరు జిల్లా చిక్కాంగల ప్రాంతానికి చెందిన ఎస్.హర్షవర్ధన్ను అదుపులోకి తీసుకుని వారి బ్యాగ్ల్లో 7.7 కేజీల గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రైల్వే పోలీస్స్టేషన్కు తరలించి విచారించారు. ఒడిశా, ఏపీ సరిహద్దు జిల్లాల్లో గంజాయిని తక్కువ ధరలకు కొనుగోలు చేసి తమిళనాడు రాష్ట్రం జోలార్పేట పరిసర ప్రాంతాల్లో అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నట్లు వెల్లడైంది. దీంతో నిందితులను అరెస్ట్ చేశారు. నిందితులందరూ 27 ఏళ్లలోపు వయసున్న వారే. దాడుల్లో పాల్గొన్న నెల్లూరు, గూడూరు రైల్వే ఎస్సైలు ఎన్.హరిచందన, వై.చెన్నకేశవ, సిబ్బంది వెంకటేశ్వర్లు, మణికంఠ తదితరులను రైల్వే డీఎస్పీ జి. మురళీధర్ అభినందించారు.
7.7 కేజీలు పట్టుకున్న రైల్వే పోలీసులు
ముగ్గురు వ్యక్తుల అరెస్ట్