
అసంతృప్తుల మధ్య కౌన్సెలింగ్
నెల్లూరు(అర్బన్): ఉమ్మడి నెల్లూరు జిల్లా పరిధిలో హెల్త్ అసిస్టెంట్ల బదిలీ కౌన్సెలింగ్ తీవ్ర అసంతృప్తుల మధ్య జరిగింది. శుక్రవారం నెల్లూరులోని జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయంలో డీఎంహెచ్ఓ సుజాత ఆధ్వర్యంలో ఈ ప్రక్రియను చేపట్టారు. మూడు రోజుల క్రితం కౌన్సెలింగ్ జరిగే సమయంలో ఆరోపణలు రాగా హెల్త్ అసిస్టెంట్లు వాయిదా వేయించారు. అయితే అప్పటికీ, ఇప్పటికీ కౌన్సిలింగ్ తీరును మార్చేశారు. ప్రస్తుతం తిరుపతి జిల్లాలో పనిచేస్తున్న (గతంలో నెల్లూరు జిల్లా ప్రాంతాలు) సూళ్లూరుపేట, నాయుడుపేట, వెంకటగిరి, గూడూరు ప్రాంతాల హెల్త్ అసిస్టెంట్లను ఆయా ప్రాంతాల సమీపంలోకి బదిలీ చేశారు. పునర్విభజన తర్వాత ఉన్న నెల్లూరు జిల్లాకు సంబంధించిన వారిని ఈ జిల్లా వరకు మాత్రమే బదిలీ చేసి సర్దుబాటు చేశారు. తిరుపతి జిల్లా పరిధిలో రీ డిప్లాయ్మెంట్ కింద 57 మంది బదిలీలు జరిగాయి. ఈ జిల్లాకు చెందిన 171 మంది బదిలీల ప్రక్రియ రాత్రి పొద్దుపోయే వరకు జరిగింది. కార్యక్రమంలో జిల్లా మలేరియా నివారణ అధికారి హుస్సేనమ్మ, సహాయ మలేరియా నివారణాధికారి నాగార్జునరావు తదితరులు పాల్గొన్నారు.
అందుకే అనుమానాలు
కాగా కౌన్సెలింగ్ ప్రక్రియలో నేరుగా యూనియన్ నాయకులు పాల్గొనకూడదు. ఎవరికై నా అన్యాయం జరిగితేనే అధికారులను ప్రశ్నించాలి. అయితే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏపీజీఈఏ) జిల్లా అధ్యక్షుడు సుధాకర్రెడ్డి నేరుగా కౌన్సెలింగ్లో పాల్గొన్నాడు. ఆయనే మైక్ తీసుకుని పేర్లను పిలవసాగాడు. అక్కడ ఖాళీ ఉంది.. ఇక్కడ ఖాళీ ఉంది.. కోరుకో అని చెప్పసాగాడు. దీంతో పలువురు హెల్త్ అసిస్టెంట్లు తమకు అన్యాయం జరుగుతోందని చర్చించుకున్నారు.