
భర్త ఇంటి ముందు భార్య నిరసన
బుచ్చిరెడ్డిపాళెం రూరల్: భర్త ఇంటి ముందు భార్య రెండు రోజుల నుంచి నిరసన తెలుపుతున్న ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. బాధితురాలు కల్యాణి కథనం మేరకు.. రేబాలకు చెందిన ప్రసన్నకుమార్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. గత సంవత్సరం జొన్నవాడలో కల్యాణిని రెండో వివాహం చేసుకున్నాడు. పైళ్లెన రెండోరోజు నుంచే వేధింపులకు గురిచేశాడని ఆమె వాపోయింది.
ఎందుకిలా చేస్తున్నావని భర్తను అడిగితే తనకు వేరే మహిళతో సంబంధం ఉందని చెప్పాడు. దీంతో కల్యాణి పుట్టింటికి వెళ్లిపోయింది. అయినా ప్రసన్నకుమార్ ప్రవర్తనలో మార్పు రాలేదు. రెండురోజుల క్రితం రేబాలలోని భర్త ఇంటికి కల్యాణి వెళ్లగా లోనికి రానివ్వకుండా అడ్డుకున్నాడు. తనను విచక్షణారహితంగా కొట్టారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. పోలీసులకు ఫిర్యాదు చేస్తానని, న్యాయం చేయాలని వేడుకుంటోంది.
వేగవంతంగా యోగాంధ్ర రిజిస్ట్రేషన్లు: ఇన్చార్జి కలెక్టర్ కార్తీక్
నెల్లూరు రూరల్: యోగాంధ్ర రిజిస్ట్రేషన్లను వేగవంతం చేయాలని ఇన్చార్జి కలెక్టర్ కె.కార్తీక్ అధికారులను ఆదేశించారు. వివిధ అంశాలపై జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలతో శుక్రవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం తన చాంబర్లో సమీక్ష చేశారు. ఎక్కువ మంది రిజిస్టర్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
జిల్లాలో సుమారు 10 లక్షల మందిని రిజస్టర్ చేయాలని లక్ష్యంగా నిర్ణయించామని, ఇప్పటి వరకు 4.5 లక్షల మంది నమోదయ్యారని తెలిపారు. పింఛన్ల పంపిణీ సమయంలో వారి కుటుంబ సభ్యుల్లో ఔత్సాహికులను రిజిస్టర్ చేయించాలన్నారు. జూన్ 2 నుంచి 7వ తేదీ వరకు జిల్లా స్థాయి యోగా కార్యక్రమం రెసిడెన్షియల్ అసోసియేషన్ థీమ్తో జరుగుతుందని, దానికి ఏర్పాట్లు చేయాలన్నారు. విద్యుత్ శాఖ, పారిశుద్ధ్యం తదితర వాటిపై సమీక్ష చేశారు.

ఇన్చార్జి కలెక్టర్ కార్తీక్