
కొడవలూరు: మండలంలోని గండవరం సబ్స్టేషన్ వద్ద జాతీయ రహదారిపై ఆదివారం వేకువ జామున ఆగి ఉన్న ట్రావెల్స్ బస్సును వెనుక నుంచి వచ్చిన కంటైనర్ లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులంతా విజయవాడకు చెందిన వారే. పోలీసులు తెలిపిన వివరాల మేరకు విజయవాడ నగరం నుంచి నాగూర్ నాగపట్నం వెళ్లేందుకు 40 మంది ప్రయాణికులు ట్రావెల్స్ బస్సులో శనివారం రాత్రి బయలుదేరారు. కొడవలూరు మండలం గండవరం సబ్స్టేషన్ వద్దకు ఆదివారం వేకువ జామున 4 గంటల ప్రాంతంలో చేరుకున్నారు. ఇక్కడ ఖాళీ ప్రదేశం ఉండడంతో ప్రయాణికులు కాలకృత్యాలు తీర్చుకునేందుకు బస్సును రోడ్డుకు పక్కగా నిలిపారు. ప్రయాణికుల్లో కొందరు ఖాళీ ప్రదేశాల్లో ఉండగా, విజయవాడ క్రీస్తురాజుపురానికి చెందిన సిరింగి బాబూరావు(50) బస్సు వెనుక నిల్చున్నారు. ఇంతలో చీమకుర్తి నుంచి చైన్నె పోర్టుకు వెళుతున్న కంటైనర్ లారీ ఆగి ఉన్న బస్సును వెనుక నుంచి ఢీకొట్టింది. లారీ అతివేగంతో ఢీకొట్టడంతో బస్సు పొలాల్లోకి దూసుకెళ్లింది. బస్సు వెనుక నిల్చొని ఉన్న బాబూరావు రెండు వాహనాల మధ్య నలిగి అక్కడికక్కడే మృతిచెందగా, బస్సులో ఉన్న ప్రయాణికుల్లో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడ్డ వారిని 108లో చికిత్స నిమిత్తం నెల్లూరు ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలైన వారిలో మృతుని కుమారుడైన కిరణ్కుమార్ పరిస్థితి విషమంగా ఉందని ఎస్సై కోటిరెడ్డి తెలిపారు. ప్రమాదం జరిగిన కొద్ది సేపటికే రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు, కొడవలూరు సీఐ సురేంద్రబాబులు ఘటనా స్థలానికి చేరుకొన్నారు. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేసేందుకు సహాయక చర్యలు చేపట్టారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
మిన్నంటిన రోదనలు
నాగూర్ నాగపట్నం వెళ్లి దర్శనం చేసుకొని వచ్చేందుకని బయలు దేరిన వారిని మార్గమధ్యలో జరిగిన ప్రమాదం కలచి వేసింది. యాత్రకు చేరుకోక ముందే బాబూరావు మృతి చెందడం, కుమారుడి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుని భార్య మున్నీ కన్నీటి పర్యంతమయ్యారు. మున్నీ రోదన బస్సులోని తోటి ప్రయాణికులను కలచి వేసింది.
ఒకరి మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు
మృతుడి కుమారుడి పరిస్థితి విషమం
బాధితులంతా విజయవాడ వాసులే
హైవేపై గండవరం
సబ్స్టేషన్ వద్ద ఘటన