క్షణం క్షణం ఉత్కంఠ | - | Sakshi
Sakshi News home page

క్షణం క్షణం ఉత్కంఠ

May 27 2025 12:09 AM | Updated on May 27 2025 12:09 AM

క్షణం

క్షణం క్షణం ఉత్కంఠ

ఎనిమిది కేసులు
తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాలో రెడ్‌బుక్‌ రాజ్యాంగం కుట్రలు పరాకాష్టకు చేరాయి. మాజీ ప్రజా ప్రతినిధు లే లక్ష్యంగా ప్రభుత్వ పెద్దల డైరెక్షన్‌లో అధికార యంత్రాంగం తప్పుడు కేసులు బనాయిస్తూ రాజ్యాంగ పరమైన న్యాయ స్ఫూర్తికి తూట్లు పొడుస్తున్నారు. అధికారులు వైఎస్సార్‌సీపీ నేతలను టార్గెట్‌ చేస్తూ అక్రమ కేసుల్లో ఇరికిస్తున్నారు. తప్పుడు కేసులు పెట్టిన అధికారులు, పోలీసులు ప్రభుత్వ మారితే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని తెలిసినా జీ హూజార్‌ అంటున్నారు. పొదలకూరు మండలంలోని తాటిపర్తిలో ఉన్న రుస్తుం మైన్స్‌లో అక్రమ మైనింగ్‌ జరగలేదని నిర్ధారించి నివేదిక ఇచ్చిన ఆ శాఖ అధికారులే ప్రభుత్వం మారిన ఎనిమిది నెలలకు అక్రమ మైనింగ్‌ జరిగిందంటూ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిని జైలుకు పంపడంపై ప్రజాగ్రహం పెల్లుబుకుతోంది.

రెడ్‌బుక్‌ కుట్రతోనే కాకాణిపై కేసు నమోదు

కూటమి పాలకులు ఎన్నికల ముందు ఇచ్చిన హామీల ను విస్మరించడం, ప్రభుత్వ వైఫల్యాలను, మోసాలను, ప్రజా వ్యతిరేక విధానాలతోపాటు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఇసుక, మద్యం, గ్రావెల్‌, బూడిద, ఇరిగేషన్‌ పను ల్లో అవినీతి, అక్రమాలను నిత్యం ప్రశ్నిస్తున్న మాజీ మంత్రి, ప్రస్తుత ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డిని టార్గెట్‌ చేసి అక్రమ కేసుల్లో ఇరికించేందుకు కుట్రలకు తెరతీశారు. రుస్తుం మైన్స్‌ లో అక్రమ మైనింగ్‌ జరిగిందంటూ అందులో పేర్నాటి శ్యామ్‌ ప్రసాద్‌రెడ్డి, వాకాటి శివారెడ్డి, వాకాటి శ్రీనివాసులరెడ్డి ప్రమేయం ఉందని మైనింగ్‌ డీడీ బాలాజీనాయక్‌తో మైనింగ్‌ అధికారులు కూటమి అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల తర్వాత పొదలకూరు స్టేషన్‌లో ఫిర్యాదు చేయించారు. అయితే ఆ ముగ్గురికి న్యాయస్థానంలో ముందస్తు బెయిల్‌ ఇచ్చింది. దీంతో కాకాణి గోవర్ధన్‌రెడ్డికి కూడా ఈజీగా బెయిల్‌ వస్తుందని భావించి అధికార పార్టీ పెద్దలు తమ కుట్రలకు పదను పెట్టారు. కాకాణితోపాటు మరో ఆరుగురిని చేరుస్తూ, నాన్‌బెయిలబుల్‌ సెక్షన్లు యాడ్‌ చేసి ఇంప్లీడ్‌ మెమో దాఖలు చేశారు.

టీడీపీ నేతలకు అరెస్ట్‌లుండవా

రుస్తుం మైనింగ్‌ కేసులో ఏ–5 గా ఉన్న గుంటమడుగు కృష్ణంరాజు టీడీపీ నేతలతో కలిసి జిల్లాలోనే తిరుగుతూ పోలీస్‌ శాఖకు దమ్ముంటే అరెస్ట్‌ చేయండి చూద్దామంటూ సవాల్‌ విసురుతున్నాడు. సైదాపురం మండల టీడీపీ మాజీ అధ్యక్షుడిగా ఉన్న కృష్ణం రాజు మైనింగ్‌ వ్యాపారంలో దిట్ట. ఒకప్పుడు సామాన్య వ్యక్తిగా ఉన్న ఆయన ప్రస్తుతం రూ.వందల కోట్లకు ఆస్తిపరుడు.ఆయన టీడీపీ నేతగా ఉండడంతో కూట మి ప్రభుత్వం అధికారంలోకి రాగానే విశ్వరూపం చూపించాడు. అనధికార మైనింగ్‌తో చెలరేగిపోయా డు. ఇది కూటమి సిండికేట్‌కు నచ్చకపోవడంతో కేసు లో నిందితుడిగా చేర్చి ఆయన దూకుడుకు కళ్లెం వేయించారు. ఈ కేసును అడ్డం పెట్టుకుని మైకా క్వా ర్ట్‌ ్జఎక్స్‌పోర్టర్‌గా విదేశీయులతో ఉన్న పరిచయాలు, ఆయన వ్యాపార అనుభవాన్ని వాడుకుని తమ కార్యకలాపాలు చక్కబెట్టుకుంటున్నారు.

మాజీ మంత్రి కాకాణిపై రెడ్‌బుక్‌ రాజ్యాంగం

అక్రమ కేసులతో జైలుకు

కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఆయనపై ఎనిమిది కేసులు నమోదు

ఇదే కేసులో టీడీపీ నేత ఏ5

నిందితుడైనా అరెస్ట్‌లుండవు!

కూటమి పాలనపై పెల్లుబుకుతున్న ప్రజాగ్రహం

వైఎస్సార్‌సీపీలో కీలక నేతలే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని అమలు చేస్తోంది. తాజాగా మాజీమంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డికి రెడ్‌బుక్‌ సంకెళ్లు వేసింది. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను, మోసాలను, సర్వేపల్లి ఎమ్మెల్యే అవినీతి, అక్రమాలను అనునిత్యం ప్రశ్నిస్తుండడంతో ఓర్చుకోలేని అధికార పార్టీ పెద్దలు పెట్టించిన కుట్ర కేసులతో ఆయన్ను జైలుకు పంపించింది. అసలు అక్రమ మైనింగే జరగలేదంటూ నివేదిక ఇచ్చిన అధికారితోనే తప్పుడు ఫిర్యాదు చేయించడంతో పాలకుల దాష్టీకాలు పరాకాష్టకు చేరాయి. ఇదే కేసులో ఆ తర్వాత నిందితుడిగా ఉన్న టీడీపీ నేతను అరెస్ట్‌ నుంచి మినహాయించడం విమర్శలకు దారితీస్తోంది.

కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న కాకాణి గోవర్ధన్‌రెడ్డిని టార్గెట్‌ చేసి కేసులు నమోదు చేస్తున్నారు. ఇప్పటికే ఆయనపై ఎనిమిది కేసులు నమోదయ్యాయి.

గతేడాది గుంటూరు జిల్లా తాడేపల్లిలో వైఎస్సార్‌సీపీ సెంట్రల్‌ కార్యాలయంలో ప్రెస్‌మీట్‌ పెడితే ఆ వార్తను ‘సాక్షి’ పత్రిక కవర్‌ చేసింది. ఆ పేపర్‌ కటింగ్‌ను సోషల్‌ మీడియాలో తన వాట్సాప్‌ నంబరుతో ఫార్వార్డ్‌ చేశారని వెంకటాచలం పోలీసులు కేసు నమోదు చేశారు.

వెంకటాచలం మండలానికి చెందిన బీజేపీ నేత నెల్లూరులో ప్రెస్‌మీట్‌ పెడితే ఆ వీడియో కాకాణి వాట్సాప్‌ నంబరుతో ఫార్వార్డ్‌ చేశారని మరో కేసు నమోదు చేశారు.

స్థానిక ఎమ్మెల్యే సోమిరెడ్డిపై అసభ్యకరంగా పోస్టింగ్‌ పెట్టాడని ముత్తుకూరు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

గతేడాది అక్టోబర్‌లో ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం అమలు చేయకపోవడంతో భవన కార్మికులు చేపట్టిన నిరసనలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడిగా కాకాణి వారికి సంఘీభావం తెలియజేస్తూ నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారని ఆయనపై దర్గామిట్ట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

గతేడాది డిసెంబర్‌లో వెంకటాచలం మాజీ జెడ్పీటీసీ వెంకటశేషయ్యపై స్థానిక పోలీసులు అక్రమ కేసు నమోదు చేసి జైలుకు పంపారు. ఆ కేసులో పోలీసులే సాక్ష్యాలు తారుమారు చేసిన విషయాలు వెలుగులోకి రావడంతో పోలీసుల తీరుపై కాకాణి ఆగ్రహం వ్యక్తం చేస్తూ తప్పు చేసిన పోలీసులపై మండిపడ్డారు. ఆయన చేసిన వ్యాఖ్యాలపై వెంకటాచలానికి చెందిన టీడీపీ కార్యకర్త వేదాయపాళెం పోలీసులకు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేశారు.

కావలి నియోజకవర్గం బోగోలు మండలం కోళ్లదిన్నెలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై టీడీపీ శ్రేణులు దాడులకు పాల్పడ్డారు. గాయపడిన వారు కావలి ప్రభుత్వాస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్న సమయంలో కూడా మరోసారి దాడులకు తెగబడ్డారు. ఆ బాధితులను పరామర్శించిన కాకాణి అక్కడ మీడియాతో మాట్లాడుతూ పోలీసుల పక్షపాత వైఖరిని ఎండగట్టి తప్పు చేసిన అధికారులు ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందేనని వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై కొళ్లదిన్నె టీడీపీ మహిళా కార్యకర్తకు బాధ కలిగించిందని ఆమె కావలి వన్‌టౌన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.

డీటీసీలో రహస్య విచారణ

కాకాణి గోవర్ధన్‌రెడ్డిని ఆదివారం కర్ణాటక రాష్ట్రం చింతామణి వెంకటాపురంలో అదుపులోకి తీసుకున్న పోలీసులు విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. రాత్రి సుమారు 9.30 గంటలకు వెంకటాచలం మండలం చెముడుగుంటలోని డీటీసీకి తీసుకువచ్చారు. అక్కడ కాకాణిని ఏఎస్పీ సీహెచ్‌ సౌజన్య, నెల్లూరు రూరల్‌ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు విచారించారు. రాత్రి 11.45 గంటల ప్రాంతంలో అరెస్ట్‌ చూపించి కాకాణి వద్దనున్న రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. సోమవారం తెల్లవారు జామున వెద్య పరీక్షల నిమిత్తం వెంకటాచంలోని పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. అక్కడ వైద్య పరీక్షల అనంతరం తిరిగి డీటీసీకి తీసుకువచ్చారు. ఉదయం 10.30 గంటల ప్రాంతంలో కట్టుద్టిమైన భద్రత నడుమ కోర్టుకు తరలించారు.

భారీగా తరలివచ్చిన అభిమానులు

144 సెక్షన్‌ అమలు

వెంకటగిరి (సైదాపురం): తప్పుడు కేసుల్లో మాజీమంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిని అరెస్ట్‌ చేసి సోమవారం వెంకటగిరి కోర్టుకు తరలించారు. ఈ క్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి సోమవారం తెల్లవారు జామునే తన నివాసానికి చేరుకున్నారు. ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి సైతం ఇక్కడికి చేరుకుని కాకాణి అక్రమ అరెస్ట్‌ను ఖండించారు. అక్కడి నుంచి నేతలు, కార్యకర్తలు వెంకటగిరి కోర్టుకు బయల్దేరారు. అయితే 144 సెక్షన్‌ అమల్లో ఉందని, కోర్టు ప్రాంగణంలోకి వెళ్లరాదని పోలీసులు అడ్డుకున్నారు. కొందరు ముఖ్య నేతలను కోర్టు ప్రాంగణంలోకి అనుమ తించారు. తర్వాత మాజీమంత్రి అనిల్‌కుమార్‌యాదవ్‌, నెల్లూరు రూరల్‌ ఇన్‌చార్జి ఆనం విజయకుమార్‌రెడ్డి, సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే సంజీవయ్యతోపాటు పలువురు ఉమ్మడి నెల్లూరు జిల్లా ప్రముఖులు కోర్టు వద్దకు చేరుకున్నారు.

కిక్కిరిసిన కోర్టు ప్రాంగణం

భారీ బందోబస్తు నడుమ నెల్లూరు నుంచి పోలీసు ఎస్కార్ట్‌ వాహనంలో కాకాణి గోవర్ధన్‌రెడ్డిని మధ్యాహ్నం 12.11 గంటలకు వెంకటగిరి కోర్టు ఆవరణానికి తీసుకొచ్చారు. తర్వాత ఆయన్ను న్యాయమూర్తి విష్ణువర్మ ఎదుట హాజరు పరిచారు. సుమారు 3 గంటల పాటు సుదీర్ఘ వాదోపవాదాలు జరగడంతో వెంకటగిరి కోర్టు ప్రాంగణంలో ఉత్కంఠ నెలకొంది. చివరకు మధ్యాహ్నం భోజన విరామం తర్వాత కాకాణికి 14 రోజుల రిమాండ్‌ విధించినట్లు న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. భారీ బందోబస్తు నడుమ నెల్లూరు సెంట్రల్‌ జైలుకు తరలించారు.

కొండంత అభిమానం

కాకాణి అక్రమ అరెస్టుతో వెంకటగిరి నియోజకవర్గంలోని ఆరు మండలాలతోపాటు ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి, నెల్లూరు రూరల్‌, నెల్లూరు సిటీ, గూడూరు, సూళ్లూరుపేట నియోజకవర్గాల నుంచి అభిమానులు, నేతలు భారీగా తరలివచ్చి తమ సంఘీభావాన్ని వ్యక్తం చేశారు. జై జగన్‌... జై గోవర్ధనన్న అంటూ అభిమానుల నినాదాలు మిన్నంటాయి. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా గూడూరు డీఏస్పీ గీతాకుమారి నేతృత్వంలో వెంకటగిరి పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

అక్రమ కేసులకు భయపడం

మాజీమంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై అక్రమ కేసులు పెట్టి జైలు పాలు చేసినా భయపడే ప్రసక్తేలేదు. గోవర్ధన్‌రెడ్డిని ఎలాగైనా హింసలకు గురి చేయాలనే కూటమి ప్రభుత్వం అక్రమ మైనింగ్‌ కేసును బనాయించింది. మైనింగ్‌ వ్యవహారంలో ఎలాంటి పాత్ర లేని ఆయనపై వివిధ సెక్షన్లపై కేసులు పెట్టి వేధిస్తోంది. ప్రజల పక్షాన నిరంతరం పోరాడే మాజీ మంత్రిపై అన్యాయంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు బనాయించారు. రాష్ట్రంలో రెడ్‌బుక్‌ రాజ్యాంగానికి తెరదీసి అక్రమ కేసులు ఎలా పెట్టాలో నేర్పిస్తున్నారు. జిల్లా ప్రజలు అంతా కాకాణి వెంటే ఉన్నారు. ఆయనకు మద్దతుగా న్యాయపోరాటం కొనసాగిస్తాం.

– అనిల్‌కుమార్‌ యాదవ్‌, మాజీ మంత్రి

కాకాణి అరెస్ట్‌ అప్రజాస్వామికం

నాయుడుపేట టౌన్‌: కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై అక్రమ కేసులు బనాయించడమే కాకుండా అట్రాసిటీ కేసులు పెట్టడం అప్రజాస్వామికం. కూటమి అక్ర మ కేసులకు భయపడేది లేదు. కాకాణికి మేమంతా అండగా ఉంటాం. కూటమి ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోంది.

– కిలివేటి సంజీవయ్య, సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే

రాజకీయ కక్షసాధింపే

పేర్నాటి శ్యామ్‌ ప్రసాద్‌రెడ్డి

నెల్లూరు (క్రైమ్‌): కాకాణి గోవర్ధన్‌రెడ్డి అరెస్ట్‌ రాజకీయ కక్షసాధింపు చర్యేనని వైఎస్సార్‌సీపీ నేత పేర్నాటి శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రకారాగారం వద్ద ఆయన విలేకరులతో మాట్లాడుతూ తమ స్వార్థరాజకీయ ప్రయోజనాలకోసం రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని అమలు చేస్తోందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలను ఓ పథకం ప్రకారమే అక్రమ కేసులు బనాయించి జైళ్లకు పంపుతున్నారన్నారు. రుస్తుం మైన్స్‌ కేసులో ఏ–1గా తనను, ఏ–4గా కాకాణి గోవర్ధన్‌రెడ్డిని చేర్చారన్నారు. తాము బెయిల్‌ కోసం కోర్టును ఆశ్రయించే నాటికి పేలుడు పదార్ధాలున్నట్లు, ఎస్సీ, ఎస్టీ సెక్షన్లు లేవన్నారు. తనతోపాటు శివారెడ్డి, శ్రీనివాసులరెడ్డికి బెయిల్‌ మంజూరైందన్నారు. ఏదో ఒక రకంగా కాకాణిని అరెస్ట్‌ చేయాలన్న ఉద్దేశంతో నాన్‌బెయిలబుల్‌ సెక్షన్లు జత చేశారన్నారు.

అండగా ఉంటాం

కూటమి ప్రభుత్వ అరా చకాలను ప్రశ్నించే ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ నాయకుల గొంతు నొక్కడం బాధాకరం. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి చర్యలు ఎప్పుడూ లేవు. కాకాణి గోవర్ధన్‌రెడ్డికి మే మంతా అండగా ఉంటాం. న్యాయం గెలిచే వరకు నిరంతరం పోరాటం కొనసాగిస్తాం.

– మేరిగ మురళీధర్‌, ఎమ్మెల్సీ

కుట్రలపై న్యాయపోరాటం

కాకాణి గోవర్ధన్‌రెడ్డి అరెస్ట్‌ పూర్తిగా అక్రమం. ఇది ముమ్మాటికీ కూటమి కుట్రే. ప్రభుత్వం ఒక ప్రణాళిక ప్రకారం కుట్రలకు తెరలేపింది. కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై అక్రమ కేసులు నమోదు బనాయించింది. తమ రాజకీయ ప్రయోజనాల కోసం రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని అమలు చేస్తోంది. కూటమి అక్రమాలపై ప్రశ్నించే వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తల గొంతు నొక్కేందుకు అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది. ఈ క్రుటలపై న్యాయ పోరాటం చేస్తాం.

– డాక్టర్‌ గురుమూర్తి, తిరుపతి ఎంపీ

కుట్ర పూరితంగా కేసు

కాకాణి గోవర్ధన్‌రెడ్డికి ఎలాంటి సంబంధం లేకున్నా అక్రమ మైనింగ్‌ కేసు నమోదు చేయ డం దారుణం. అదే మైనింగ్‌ వ్యవహారంలో 2023లో విచారణ జరగాక ఎలాంటి అక్రమాలు లేవని అధికారులు ధ్రువీకరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అదే అధికారితో అక్రమాలు జరిగాయంటూ ఇచ్చిన వివరాలతో కాకాణిపై ఏ–4గా కేసు నమోదు చేయడం దుర్మార్గం. కూటమి ప్రభుత్వ తీరుపై జూన్‌ 4న వెన్నుపోటు దినోత్సవాన్ని నిర్వహించనున్నాం. కూటమి దౌర్జన్యాలు, అరాచకాలు, భూ మాఫియా, మైనింగ్‌ మాఫియా, దుర్మార్గాలు ప్రజలు దృష్టికి తీసుకెళ్తాం.

– పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీ

పరాకాష్టకు కుయుక్తులు

మైనింగ్‌ కేసులో ఏ–1, ఏ–2, ఏ–3కి బెయిల్‌ వస్తే ఏ–4 కాకాణి గోవర్ధన్‌రెడ్డిని దురుద్దేశ పూర్వకంగా జైలుకు పంపారు. ఆయనపై నమోదు చేసిన కేసులో బలం లేకపోవడంతో కక్షపూరిత ధోరణితో ఎస్సీ, ఎస్టీ కేసును నమోదు చేశారు. మైనింగ్‌లో బ్లాస్టింగ్‌ చేశారని కేసులు నమోదు చేయడం ఆశ్చర్యమేస్తోంది. సైదాపురంలో ఇష్టానుసారంగా అక్రమ మైనింగ్‌, అక్రమ బ్లాస్టింగ్‌పై కలెక్టర్‌, ఎస్పీ, ఢిల్లీలోని కేంద్ర మైనింగ్‌ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లాం. వారిపై చర్యలు తీసుకోకపోగా ఎలాంటి సంబంధం లేని వారిపై తప్పు డు కేసులు బనాయించి జైలు పాలు చేస్తున్నారు.

– నేదురుమల్లి రాంకుమార్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త

కావలి (జలదంకి): మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిని అక్రమంగా అరెస్ట్‌ చేసి జైలుకు పంపించడం కూటమి ప్రభుత్వ వేధింపులకు పరాకాష్టగా నిలుస్తుంది. దీనికి తగిన మూల్యం చెల్లించుకో తప్పదు. కాకాణిని అరెస్ట్‌ చేయడం అత్యంత హేయమైన చర్య అని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాం. రెడ్‌బుక్‌ రాజ్యాంగం పేరుతో అధికార దురిన్వియోగానికి, దాష్టీకానికి పాల్పడుతుంది. రుస్తుం మైన్స్‌లో ఎలాంటి అక్రమాలు జరగలేదని మైనింగ్‌ శాఖ జాయింట్‌ ఇన్‌స్పెక్షన్‌ నివేదిక ఇచ్చింది. అయినా కక్ష పూరితంగా కాకాణిపై తప్పుడు సెక్షన్లు జోడించి అరెస్ట్‌ చేయడం దారుణం.

– రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, కావలి మాజీ ఎమ్మెల్యే

క్షణం క్షణం ఉత్కంఠ 1
1/8

క్షణం క్షణం ఉత్కంఠ

క్షణం క్షణం ఉత్కంఠ 2
2/8

క్షణం క్షణం ఉత్కంఠ

క్షణం క్షణం ఉత్కంఠ 3
3/8

క్షణం క్షణం ఉత్కంఠ

క్షణం క్షణం ఉత్కంఠ 4
4/8

క్షణం క్షణం ఉత్కంఠ

క్షణం క్షణం ఉత్కంఠ 5
5/8

క్షణం క్షణం ఉత్కంఠ

క్షణం క్షణం ఉత్కంఠ 6
6/8

క్షణం క్షణం ఉత్కంఠ

క్షణం క్షణం ఉత్కంఠ 7
7/8

క్షణం క్షణం ఉత్కంఠ

క్షణం క్షణం ఉత్కంఠ 8
8/8

క్షణం క్షణం ఉత్కంఠ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement