
వైభవంగా శేషవాహన సేవ
బుచ్చిరెడ్డిపాళెం రూరల్: మండలంలోని జొన్నవాడలో కొలువైన మల్లికార్జున స్వామి సమేత కామాక్షితాయి ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం స్వామి, అమ్మవారు శేష వాహనంలో భక్తులకు దర్శనమిచ్చారు. అధిక సంఖ్యలో భక్తులు దేవదేవేరులను దర్శించుకుని, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఏర్పాట్లను ఈఓ శ్రీనివాసులురెడ్డి పర్యవేక్షించారు.
మెప్మా పీడీగా లీలారాణి
నెల్లూరు (బారకాసు): పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) నెల్లూరు జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్గా డిప్యూటీ కలెక్టర్ బి.లీలారాణి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో లీలారాణి సోమవారం మెప్మా పీడీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు పీడీగా ఉన్న రాధమ్మ తిరిగి చిత్తూరు జిల్లా మెప్మా పీడీగా బదిలీ అయ్యారు. లీలారాణి గతంలో జిల్లాలో డిప్యూటీ తహసీల్దార్గా, గూడూరు, కోట, బోగోలు, సైదాపురం తహసీల్దార్గా పనిచేశారు. ప్రస్తుతం రాజంపేట భూసేకరణ విభాగంలో డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తూ బదిలీపై నెల్లూరు మెప్మాగా పీడీగా నియమితులయ్యారు.
నెల్లూరు బార్ అసోసియేషన్ ఎన్నికలు షురూ
● నేటి నుంచి నామినేషన్ల
ప్రక్రియ ప్రారంభం
నెల్లూరు (లీగల్): నెల్లూరు బార్ అసోసియేషన్ కార్యవర్గ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. సోమవారం ఎన్నికల అధికారి బి.శ్రీనివాసన్ నోటిఫికేషన్ జారీ చేశారు. మంగళవారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమై 26వ తేదీతో ముగుస్తుంది. 27న నామినేషన్ల పరిశీలన, 30న ఉపసంహరణ అనంతరం అర్హులైన అభ్యర్థుల జాబితాను అదే రోజు ప్రకటిస్తారు. జూన్ 20వ తేదీ ఉదయం నుంచి ఓటింగ్ ప్రక్రియ జరుగుతుంది. అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఎటువంటి ఘర్షణలకు తావివ్వకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి ఎన్నికలు సక్రమంగా నిర్వహించే విధంగా ప్రణాళిక రూపొందించినట్లు ఎన్నికల అధికారి తెలిపారు.
బండలాగుడు పోటీల్లో బల్లికురవ ఎడ్లు విజేత
సీతారామపురం: మండలంలోని సంగసానిపల్లిలో కొలువైన కోదండరామస్వామి ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ఎడ్లతో బండలాగుడు పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో బాపట్ల జిల్లా బల్లికురవకు చెందిన పావులూరి వీరాస్వామి ఎడ్లు 19 నిమిషాల్లో 1,600 మీటర్లు బండను లాగి ప్రథమ స్థానంలో నిలిచాయి. అతనికే చెందిన మరో జత ఎడ్లు 16.6 నిమిషాల వ్యవధిలో 1,200 మీటర్లు బండలాగి ద్వితీయ స్థానంలో నిలువగా, ప్రకాశం జిల్లా బేస్తవారిపేట జేసీ అగ్రహారానికి చెందిన లక్కునాగ శివశంకర్ ఎడ్లు 20 నిమిషాల వ్యవధిలో 1,016.7 మీటర్లు బండ లాగి తృతీయ స్థానంలో నిలిచాయి. కోదండరామస్వామి భక్త బృందం ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన ఎడ్ల యజమానులకు రూ.50,000, రూ.30,000, రూ.20,000 చొప్పున నగదు బహుమతులను అందజేశారు.
సెలవులో జేసీ
నెల్లూరు రూరల్: జిల్లా జాయింట్ కలెక్టర్ కె.కార్తీక్ సెలవుపై వెళ్లనున్నారు. వ్యక్తిగత పనుల నిమిత్తం ఆయన మంగళవారం నుంచి వారం రోజులపాటు సెలవులో ఉంటారు. అనంతరం తిరిగి విధుల్లో చేరన్నారని కలెక్టరేట్ అధికారులు తెలిపారు.

వైభవంగా శేషవాహన సేవ

వైభవంగా శేషవాహన సేవ