ట్రేడ్‌ లైసెన్స్‌.. సైలెన్స్‌ | - | Sakshi
Sakshi News home page

ట్రేడ్‌ లైసెన్స్‌.. సైలెన్స్‌

Apr 30 2025 12:13 AM | Updated on Apr 30 2025 12:13 AM

ట్రేడ్‌ లైసెన్స్‌.. సైలెన్స్‌

ట్రేడ్‌ లైసెన్స్‌.. సైలెన్స్‌

నెల్లూరు(బారకాసు): నెల్లూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని ప్రధానరోడ్లతో సహా కాలనీల్లో ఇబ్బడి ముబ్బడిగా వివిధ రకాల వ్యాపార, వాణిజ్య సముదాయాలు వెలుస్తున్నా.. ఆ స్థాయిలో ట్రేడ్‌ లైసెన్సుల జారీ జరగటం లేదు. సంబంధిత వ్యాపారులు కూడా ట్రేడ్‌ లైసెన్సులపై శ్రద్ధ చూపడం లేదు. వ్యాపార వాణిజ్య సముదాయాలు, దుకాణాలు నడపాలంటే నిబంధనల ప్రకారం నగర పాలక సంస్థకు తప్పనిసరిగా ట్రేడ్‌ లైసెన్సుకు వ్యాపారులు తగిన రుసుము చెల్లించి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే వాణిజ్య, వ్యాపార సముదాయాల యజమానులు చాలామంది ట్రేడ్‌ లైసెన్సులు తీసుకోవడం లేదు. దీంతో కార్పొరేషన్‌ ఆదాయాన్ని కోల్పోతోంది.

పన్నుల మదింపులో తేడాలు

నగర పరిధిలో విద్యాసంస్థలు, ఆసుపత్రులు, పరిశ్రమలు, హోటళ్లు, దుకాణాలకు సంబంధించిన పన్నుల మదింపులో కూడా తేడాలు కోకొల్లలుగా ఉన్నాయి. దీంతో కార్పొరేషన్‌కు ఏటా పెద్ద ఎత్తున రావలసిన ఆదాయానికి గండి పడుతోంది. దీనికి ప్రధాన కారణం నగర పాలక సంస్థలోని కొంత మంది సిబ్బంది అవినీతి, అక్రమాలకు తలొగ్గటమేనన్న ఆరోపణలున్నాయి.

వ్యాపారం ఆధారంగా

నగర పాలక సంస్థ పరిధిలో వ్యాపారం నిర్వహించుకునేందుకు విస్తీర్ణంతో సంబంధం లేకుండా చేస్తున్న వ్యాపారాన్ని బట్టి ఫీజులు చెల్లించాల్సి ఉంది. నిత్యావసర సరుకులు, ఆసుపత్రులు, హోటళ్లు, విద్యాసంస్థలు ఇలా అనేక రకాల వాణిజ్య, వ్యాపారాలకు సంబంధించి స్థాయిని బట్టి రూ.300 నుంచి రూ.40వేల వరకు చెల్లించాల్సి ఉంటుంది. వ్యాపారస్థులు కార్పొరేషన్‌ నుంచి ట్రేడ్‌ లైసెన్సు తీసుకుని ఏటా నిర్దేశించిన ఫీజు చెల్లించాల్సి ఉండగా చాలా మంది దుకాణాల నిర్వాహకులు లైసెన్సులు తీసుకునేందుకు ముందుకు రావడం లేదు. ఏటా ఏప్రిల్‌లో దుకాణాల నిర్వాహకులు తప్పనిసరిగా ట్రేడ్‌ లైసెన్సును పునరుద్ధరించుకోవాలని అధికారులు చెబుతున్నా ఆచరణలో అమలుకు నోచుకోవడం లేదు.

ఎన్‌ఎంసీ పరిధిలో పరిస్థితి ఏంటంటే..

నెల్లూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో ఉన్న వ్యాపార, వాణిజ్య సముదాయాలకు సంబంధించి 11,560 ట్రేడ్‌ లైసెన్సులున్నాయి. వీటి నుంచి ఏటా రూ.4,33,32,805 వసూలు కావాల్సి ఉంది. అయితే 2024–25 సంవత్సరానికి గాను రూ.2,09,05,595 వసూలైంది. ఇంకా రూ.2,24,27,210 వసూలు కావాల్సి ఉంది. ఇది అధికారిక గణాంకాలు. వాస్తవానికి ఇంతకు రెండింతలుగా కార్పొరేషన్‌కు ఆదాయం వచ్చే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నెల్లూరు నగరంలో వ్యాపార దుకాణాలు దాదాపు 25వేలకు పైగా ఉండవచ్చని అంచనా. పూర్తిస్థాయిలో గనుక పరిశీలించి వాణిజ్య, వ్యాపార సముదాయాలను గుర్తించగలిగితే ట్రేడ్‌ లైసెన్సులు లేనివి వేల సంఖ్యలో బయటపడే అవకాశం ఉంటుంది. వాటన్నింటికి ట్రేడ్‌ లైసెన్సులు జారీ చేసినట్లయితే ఎన్‌ఎంసీకి ప్రస్తుతం వస్తున్న ఆదాయం రెండింతలు పెరిగే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.

విలీన పంచాయతీల్లోనూ అంతే

నగర పాలక సంస్థ పరిధిలో విలీన గ్రామ పంచాయతీల్లో పెద్ద ఎత్తున దుకాణాలు, వ్యాపార, వాణిజ్య సంస్థలు ఉన్నాయి. గతంలో ఉన్నవాటికి రెట్టింపు సంఖ్యలో కొత్తగా దుకాణాలు, వాణిజ్య, వ్యాపారసంస్థలు వెలిశాయి. చాలా వాటికి ట్రేడ్‌ లైసెన్సులు పొందకుండానే వ్యాపార సముదాయాలను నిర్వహిస్తున్నారు.

ఎన్‌ఎంసీ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం ద్వారా కార్పొరేషన్‌లో మరింత ఆదాయం పెంచాల్సిన అవసరం ఉంది. హోటళ్లు, రెస్టారెంట్లు, ఆసుపత్రులు, కిరాణా దుకాణాలు, సెల్‌పాయింట్లు, మొబైల్‌ షోరూంలు, వస్త్రదుకాణాలు, ఆన్‌లైన్‌ సెంటర్లు తదితర వాణిజ్య సంస్థలు భారీగా పెరిగిపోయాయి. రోజురోజుకూ వ్యాపార, వాణిజ్య సంస్థలు పెరిగిపోతున్నా.. చాలామంది నిర్వాహకులు ట్రేడ్‌ లైసెన్స్‌ పొందడం లేదు. దీంతో ఎన్‌ఎంసీ ఆదాయానికి రూ.కోట్లలో గండిపడుతోంది.

ఆదాయం పెంపుపై

దృష్టిపెట్టని అధికారులు

ముందుకురాని వాణిజ్య

సంస్థల యజమానులు

పునరుద్ధరణపైనా సిబ్బంది నిర్లక్ష్యమే

చిత్తశుద్ధి లేని కార్పొరేషన్‌

యంత్రాంగం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement