● ఎస్ఈ వెంకటసుబ్బయ్య
నెల్లూరు(వీఆర్సీసెంటర్) : రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలైన గడప గడపకు మన ప్రభుత్వం, పేదలందరికీ ఇళ్లు తదితరాల్లో ప్రజల ఇబ్బందులను గుర్తించి తొలి ప్రాధాన్యతక్రమంలో పరిష్కరించాలని ఏపీఎస్పీడీసీఎల్ జిల్లా సర్కిల్ ఎస్ఈ వెంకటసుబ్బయ్య విద్యుత్ అధికారులను ఆదేశించారు. నగరంలోని విద్యుత్భవన్లో ఆయన జిల్లా ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, డిప్యూటీ ఇంజినీర్లు, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్లతో బుధవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ అధికారులు ఫీజ్ ఆఫ్ కాల్స్ (ఎఫ్ఓసీ) వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని, 33 కేవీ, 11 కేవీ విద్యుత్ ఫీడర్లలో పీఎంపీ(ఫ్రీ మన్సూన్ ఇన్స్పెక్షన్) నిర్వహించాలని అధికారులను ఆదేశించామన్నారు. విద్యుత్ సబ్స్టేషన్ల నిర్వహణ కచ్చితంగా చేయాలని, ఫిబ్రవరి నెలాఖరు వరకు నమోదు చేసుకున్న వ్యవసాయ విద్యుత్ సర్వీసులను మంజూరు చేశామన్నారు. వ్యవసాయ సర్వీసులు ఇచ్చేందుకు అవసరమైన ట్రాన్స్ఫార్మర్లు మెటీరియల్ స్టోర్స్లో అందుబాటులో ఉందని తెలిపారు. వ్యవసాయ విద్యుత్ సర్వీసులకు సంబంధించి రైతుల ఫోన్ నంబర్, ఆధార్ నంబర్ను లింక్ చేయాలని సూచించారు. ఎస్ఈతో పాటు విద్యుత్శాఖ అకౌంట్స్ ఆఫీసర్ మురళి పాల్గొన్నారు.