జోహన్నెస్బర్గ్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో వెస్టిండీస్ 6 పరుగుల తేడాతో (డక్వర్త్ లూయిస్ పద్దతి) విజయం సాధించింది. దీంతో క్లీన్ స్వీప్ ప్రమాదం నుంచి పర్యాటక విండీస్ తప్పించుకుంది. వర్షం, మెరుపులు కారణంగా ఈ మ్యాచ్ను 10 ఓవర్లకు కుదించారు.
తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 10 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది. విండీస్ ఇన్నింగ్స్లో కెప్టెప్ షాయ్ హోప్(25 బంతుల్లో 48), షిమ్రాన్ హెట్మైర్ (22 బంతుల్లో 48 పరుగులు) మెరుపు ఇన్నింగ్స్లు ఆడారు. సఫారీ బౌలర్లలో ఎంగిడీ, మఫాక, కేశవ్ మహారాజ్ తలా వికెట్ సాధించారు.
అనంతరం డీఎల్ఎస్ పద్దతి ప్రకారం.. దక్షిణాఫ్రికా లక్ష్యాన్ని 10 ఓవర్లలో 125 పరుగులుగా నిర్ణయించారు. లక్ష్య చేధనలో కెప్టెన్ ఐడైన్ మార్క్రమ్ త్వరగా ఔటైనప్పటికి క్వింటన్ డికాక్ (28) శుభారంభం ఇచ్చాడు. కానీ వరుస క్రమంలో వికెట్లు కోల్పోవడంతో ప్రోటీస్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది.
విండీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో సఫారీలు 6 వికెట్లు కోల్పోయి 118 పరుగులకే పరిమితమయ్యారు. కరేబియన్ బౌలర్లలో గుడికేష్ మోటీ మూడు వికెట్లతో సత్తాచాటాడు. అయితే తొలి రెండు టీ20ల్లో విజయం సాధించిన సౌతాఫ్రికా.. సిరీస్ను 2-1 తేడాతో సొంతం చేసుకుంది.


