అప్పుడు ట్రోల్‌ చేసి ఇప్పుడు జాలి చూపిస్తున్నారా! | Trolls About CSK Showing Sympathy On Dhoni Who Trolled Seniors Years Ago | Sakshi
Sakshi News home page

అప్పుడు ట్రోల్‌ చేసి ఇప్పుడు జాలి చూపిస్తున్నారా!

Oct 3 2020 3:52 PM | Updated on Oct 3 2020 6:34 PM

Trolls About CSK Showing Sympathy On Dhoni WhoTrolled Seniors Years Ago - Sakshi

దుబాయ్‌ : ఎంఎస్‌ ధోని అంటే చిరుతకు మారుపేరు. బ్యాటింగ్‌ సమయంలో ధోని  క్రీజులో ఉన్నాడంటే చిరుతలా పరిగెత్తుతాడు. అతని వేగానికి అవతలి ఫీల్డర్లకు రనౌట్‌ చేసే అవకాశం లభించదు అంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. మరి అలాంటి ధోని శుక్రవారం ఎస్‌ఆర్‌హెచ్‌తో జరిగిన మ్యాచ్‌లో మ్యాచ్‌లో తీవ్రంగా అలసిపోయాడు. ఒకానొక సందర్భంలో ఇక పరిగెత్తడం తన వల్ల కాదనే స్థితిలోకి వెళ్లిన ధోని కాసేపు అలాగే నిలబడిపోయాడు. అయితే దుబాయ్‌లో ఎక్కువగా పొడి వాతావరణం ఉన్న కారణంగానే ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొవాల్సి వచ్చిందని ధోనీ వివరణ కూడా ఇచ్చాడు. (చదవండి : చాలా కష్టంగా ఉంది.. ధోనీకేమైంది?)

అయితే ఈ విషయంలో సీఎస్‌కే ధోనిపై జాలి చూపిస్తూ.. ధోని జట్టును గెలిపించడానికి ఎంతో ప్రయత్నించాడు.. ఆ తరుణంలోనే పరుగులు తీసి అలసిపోయాడు అంటూ కామెంట్స్‌ చేసింది. ఈ కామెంట్స్‌పై సీఎస్‌కే యాంటీ అభిమానులు కాస్త భిన్నంగా స్పందించారు. గతంలో ఇదే సీఎస్‌కే  2010,2011 ఐపీఎల్‌ సీజన్లలో అప్పటి టీమిండియా సీనియర్‌ ఆటగాళ్లైన వీరేంద్ర సెహ్వాగ్‌, రాహుల్‌ ద్రావిడ్‌లనుద్దేశించి వ్యంగంగా ట్వీట్‌ చేసింది. ' విధ్వంసంగా ఆడే ఆటను సెహ్వాగ్‌ మరిచిపోయాడా... టీ20లు ఆడడానికి రాహుల్‌ ద్రవిడ్‌ ఇంకా సిద్దంగా ఉన్నాడా ' అంటూ కామెంట్‌ చేసింది. ప్రస్తుతం ధోని పరిస్థితి కూడా ఇలాగే ఉందంటూ సీఎస్‌కే యాంటీ ఫ్యాన్స్‌ సెహ్వాగ్‌, ద్రవిడ్‌ల ఫోటో స్థానంలో ధోని ఫోటో పెట్టి ట్రోల్‌కు దిగారు. అప్పడు ట్రోల్‌ చేసిన సీఎస్‌కే ఇప్పుడు మాత్రం ధోని పై జాలి చూపించే ప్రయత్నం చేస్తున్నారా అంటూ కామెంట్స్‌ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.


ఐపీఎల్‌ 13వ సీజన్లో టైటిల్‌ ఫేవరెట్లలో ఒకరిగా బరిలోకి దిగిన చెన్నై సూపర్‌కింగ్స్‌ మొదటి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను ఓడించి లీగ్‌ను గెలుపుతో ఆరంభించింది. అయితే ఆ తరువాతే అసలు కథ మొదలైంది.  ముంబైతో మ్యాచ్‌ తర్వాత ఆర్‌ఆర్‌, ఢిల్లీ, సన్‌రైజర్స్‌ జట్ల చేతిలో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోయి పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. అన్ని జట్లు లక్ష్యచేధనలో పోటీపడీ ఓడిపోతుంటే.. సీఎస్‌కే మాత్రం నామమాత్రపు స్కోర్లను కూడా చేధించలేకపోతుంది. ఎంఎస్‌ ధోని లాంటి ఫినిషర్‌ ఉండి కూడా ఎస్‌ఆర్‌హెచ్‌తో జరిగిన మ్యాచ్‌లో 7పరుగులతో ఓడిపోయింది. అయితే ఈ మ్యాచ్‌లో ధోని ఆఖరివరకు నిలిచి జట్టును గెలిపించలేకపోయాడు.  ఇక సీఎస్‌కే తన తర్వాతి మ్యాచ్‌ అక్టోబర్‌ 4న కింగ్స్‌ ఎలెవెన్‌ పంజాబ్‌తో ఆడనుంది. (చదవండి : 'ఆకాశ్‌.. ముందు మీ స్ట్రైక్‌రేట్‌ చూసుకోండి')

Advertisement
 
Advertisement
Advertisement