అన్నీ మాకు సానుకూలాంశాలే, టీమిండియా​ను కచ్చితంగా ఓడిస్తాం..పాక్‌ కెప్టెన్ ధీమా | Sakshi
Sakshi News home page

T20 World Cup 2021: టీమిండియా​ను కచ్చితంగా ఓడిస్తాం.. పాక్‌ కెప్టెన్ ధీమా

Published Fri, Sep 3 2021 1:22 PM

T20 World Cup: India Will Be Under More Pressure Says Pak Captain Babar Azam - Sakshi

కరాచీ: అక్టోబరు 17 నుంచి నవంబరు 14 వరకు యూఏఈ, ఒమన్ వేదికగా టీ20 ప్రపంచకప్‌-2021 జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రపంచకప్‌ విజేతపై మాజీలు, ప్రస్తుత ఆటగాళ్లు తమతమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. తాజాగా పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ కూడా పొట్టి ప్రపంచకప్‌పై స్పందించాడు. ఈసారి తమ జట్టు టీమిండియాపై పైచేయి సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశాడు. గ్రూప్ 2లో భాగంగా అక్టోబ‌ర్ 24న భారత్, పాక్‌ల మ‌ధ్య దుబాయ్‌ వేదికగా జరిగే మ్యాచ్‌లో కోహ్లి సేనను కచ్చితంగా మట్టికరిపిస్తామని ఓవర్‌ కాన్ఫిడెన్స్‌ను వ్యక్తపరిచాడు. 

పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కొత్త ఛైర్మన్ రమీజ్ రాజాతో సమావేశం అనంతరం ఆయన ఈమేరకు వ్యాఖ్యానించాడు. టోర్నీ మొదటి మ్యాచ్‌లోనే భారత్‌ను ఎదుర్కోవడంపై ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. పాక్‌​తో పోల్చితే టీమిండియాపైనే ఒత్తిడి అధికంగా ఉంటుందని, దీన్ని క్యాష్‌ చేసుకుని టీమిండియాపై విజయం సాధించి మెగా టోర్నీలో శుభారంభం చేస్తామని పేర్కొన్నాడు. టీమిండియా ఆటగాళ్లు జట్టుగా టీ20లు ఆడి చాలా రోజులవుతుందని, దీన్ని తాము  సానుకూలాంశంగా పరిగణిస్తామని తెలిపాడు. 

ఇక ప్రపంచకప్‌ వేదికైన యూఏఈ మాకు సొంతిల్లు లాంటిదని, అది కూడా మాకు కలిసి వస్తుందని అన్నాడు. కాగా, ఇటీవలి కాలంలో భారత్‌ రెండు గ్రూపులుగా విడిపోయి సిరీస్​లు ఆడింది. కోహ్లి సారథ్యంలోని ప్రధాన జట్టు ఇంగ్లండ్​లో టెస్టు సిరీస్ ఆడుతుండగా, ధవన్ నేతృత్వంలో మరో జట్టు శ్రీలంక పర్యటనలో పరిమిత ఓవర్ల సిరీస్​లో పాల్గొంది. ఈ అంశాన్నే పాక్‌ కెప్టెన్‌ పదేపదే ప్రస్తావించాడు. ఇదిలా ఉంటే, టీ20 ప్రపంచకప్‌ గ్రూప్ 1లో వెస్టిండీస్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు ఉండగా.. గ్రూప్ 2లో భారత్, పాకిస్థాన్, న్యూజిలాండ్, అఫ్గానిస్థాన్ జట్లు ఉన్నాయి. 
చదవండి: శార్దూల్‌ సుడిగాలి ఇన్నింగ్స్‌.. సెహ్వాగ్‌ రికార్డు సహా మరో రికార్డు బద్దలు

Advertisement
Advertisement