టీ20 ప్రపంచకప్-2026 ఫైనల్ సందర్భంగా అర్ష్దీప్ సింగ్ వ్యవహరించిన తీరుపై టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తాజాగా స్పందించాడు. ఆ సమయంలో తాను న్యూజిలాండ్ స్టార్ డారిల్ మిచెల్కు క్షమాపణలు చెప్పానని తెలిపాడు. కాగా అహ్మదాబాద్ వేదికగా మార్చి 8న జరిగిన ఫైనల్లో భారత్- న్యూజిలాండ్ టైటిల్ కోసం తలపడ్డ సంగతి తెలిసిందే.
ఈ మ్యాచ్లో భారత్ కివీస్ను 96 పరుగుల తేడాతో చిత్తు చేసి ట్రోఫీని గెలుచుకుంది. ఇదిలా ఉంటే.. టైటిల్ పోరులో భారత పేసర్ అర్ష్దీప్ సింగ్.. న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్ పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. అర్ష్ బౌలింగ్లో మిచెల్ అతడి వైపే బంతిని ఆడాడు.
బాల్తో కొట్టిన అర్ష్దీప్
బాల్ అందుకున్న అర్ష్దీప్ దానిని మిచెల్ వైపు విసిరి కొట్టగా.. అతడికి బలంగా తాకింది. దీంతో మిచెల్ ఆగ్రహంతో అర్ష్ వైపు దూసుకురాగా.. అంపైర్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా వచ్చి సముదాయించడంతో పరిస్థితి చల్లబడింది. అయితే, అంతర్జాతీయ క్రికెట్ మండలి మాత్రం నిబంధనల ప్రకారం.. ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించినందుకు అర్ష్దీప్ మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత పెట్టింది.
అర్ష్దీప్ చేసిన పనికి అతడికి క్షమాపణలు చెప్పాను
ఈ విషయంపై సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) తాజాగా మాట్లాడుతూ.. ‘‘న్యూజిలాండ్తో టీ20 వరల్డ్కప్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా డారిల్ మిచెల్పైకి అర్ష్దీప్ సింగ్ బంతి విసిరిన సందర్భంలో నేను కివీస్ ప్లేయర్కు క్షమాపణలు చెప్పా. ఇలాంటి పెద్ద మ్యాచ్ల్లో కొన్నిసార్లు అలా జరిగిపోతూ ఉంటుంది.

అర్ష్ దీప్ కూడా క్షణికావేశంలో జరిగిపోయిందని అన్నాడు. వెంటనే మిచెల్కు క్షమాపణ చెప్పాడు. మ్యాచ్ అనంతరం అర్ష్ దీప్ బహిరంగంగా సైతం ఇదే పనిచేశాడు. సారథిగా ప్రత్యర్థి ప్లేయర్లను సైతం గౌరవించడం నా బాధ్యత’’ అని పేర్కొన్నాడు.
ఇదిలా ఉంటే.. హెడ్కోచ్ గౌతం గంభీర్ ఈ విషయంలో అర్ష్దీప్నుకు వత్తాసు పలికిన విషయం తెలిసిందే. దేశం కోసం ఆడే సమయంలో ఆ మాత్రం దూకుడు అవసరమని.. తన దృష్టిలో అర్ష్ క్షమాపణ చెపాల్సిన అవసరం లేదని సమర్థించాడు.
చదవండి: సన్రైజర్స్పై విమర్శలు.. అబ్రార్ అహ్మద్ షాకింగ్ రియాక్షన్!


