మయామి ఓపెన్ టైటిల్ సొంతం
ఫ్లోరిడా: ఈ సీజన్లో తన అద్భుత ఫామ్ కొనసాగిస్తూ ప్రపంచ నంబర్వన్, బెలారూస్ స్టార్ సబలెంకా మూడో టైటిల్ను తన ఖాతాలో జమ చేసుకుంది. ఆదివారం జరిగిన మయామి ఓపెన్ డబ్ల్యూటీఏ–1000 టెన్నిస్ టోర్నీలో సబలెంకా చాంపియన్గా నిలిచి టైటిల్ను నిలబెట్టుకుంది. ప్రపంచ నాలుగో ర్యాంకర్ కోకో గాఫ్ (అమెరికా)తో జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో టాప్ సీడ్ సబలెంకా 6–2, 4–6, 6–3తో విజయం సాధించి కెరీర్లో 24వ టైటిల్ను దక్కించుకుంది.
రెండు వారాల క్రితం ఇండియన్ వెల్స్ డబ్ల్యూటీఏ–1000 టెన్నిస్ టోర్నీ టైటిల్ నెగ్గిన సబలెంకా ఈ క్రమంలో ‘సన్షైన్ డబుల్’ ఘనత నమోదు చేసింది. ఇండియన్ వెల్స్, మయామి ఓపెన్ టోర్నీ టైటిల్స్ను వరుసగా గెలిస్తే ‘సన్షైన్ డబుల్’గా పరిగణిస్తారు. కోకోగాఫ్తో 2 గంటల 9 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో సబలెంకా మూడు ఏస్లు సంధించింది.
తొలి సర్వీస్లో 35 పాయింట్లు, రెండో సర్వీస్లో 19 పాయింట్లు స్కోరు చేసింది. తన సర్వీస్ను ఒకసారి కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. చాంపియన్ సబలెంకాకు 11,51,380 డాలర్ల (రూ. 10 కోట్ల 92 లక్షలు) ప్రైజ్మనీ, 1000 ర్యాంకింగ్ పాయింట్లు... రన్నరప్ కోకోగాఫ్కు 6,12,340 డాలర్ల (రూ. 5 కోట్ల 80 లక్షలు) ప్రైజ్మనీ, 650 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.


