కోహ్లి మాస్టర్‌ క్లాస్‌.. మోరిస్‌ మెరుపులు | RCB set Target Of 172 Runs Against Kings Punjab | Sakshi
Sakshi News home page

కోహ్లి మాస్టర్‌ క్లాస్‌.. మోరిస్‌ మెరుపులు

Oct 15 2020 9:15 PM | Updated on Oct 15 2020 9:18 PM

RCB set Target Of 172 Runs Against Kings Punjab - Sakshi

షార్జా:  కింగ్స్‌ పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆర్సీబీ 172 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది.టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆర్సీబీకి శుభారంభం లభించలేదు. అరోన్‌ ఫించ్‌(20), దేవదూత్‌ పడిక్కల్‌(18)లు నిరాశపరిచారు. మురుగన్‌ అశ్విన్‌ బౌలింగ్‌లో ఫించ్‌ ఔట్‌ కాగా, అర్షదీప్‌ బౌలింగ్‌లో పడిక్కల్‌ పెవిలియన్‌ చేరాడు. వీరిద్దరూ ఏడు ఓవర్లలోపే పెవిలియన్‌కు వెళ్లారు. ఆ తరుణంలో కోహ్లి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. ఆదిలోనే ఆర్సీబీ వికెట్లను చేజార్చుకోవడంతో కోహ్లి మరో మాస్టర్‌ క్లాస్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. కోహ్లి(48; 39 బంతుల్లో 3ఫోర్లు) జట్టు స్కోరును గాడిలో పెట్టాడు. అతనికి జతగా శివం దూబే(23; 19 బంతుల్లో 2 సిక్స్‌)లు కాసేపు మెరుపులు మెరిపించాడు. కానీ ఏబీ డివిలియర్స్‌(2) విఫలం కావడంతో ఆర్సీబీ స్కోరులో వేగం తగ్గింది.

డివిలియర్స్‌ ఐదో వికెట్‌గా ఔటైన కాసేపటికే కోహ్లి ఆరో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. స్కోరును పెంచే క్రమంలో కోహ్లి ఔటయ్యాడు. దాంతో హాఫ్‌ సెంచరీ చేసే అవకాశాన్ని కోహ్లి చేజార్చుకున్నాడు. షమీ బౌలింగ్‌లో రాహుల్‌ క్యాచ్‌ పట్టడంతో కోహ్లి ఇన్నింగ్స్‌ ముగిసింది. చివర్‌లో క్రిస్‌ మోరిస్‌(25 నాటౌట్‌;  8 బంతుల్లో 1 ఫోర్‌, 3 సిక్స్‌లు) బ్యాట్‌ ఝుళిపించాడు. షమీ వేసిన ఆఖరి ఓవర్‌లో క్రిస్‌ మోరిస్‌ 1 ఫోర్‌, రెండు సిక్స్‌లు కొట్టగా, ఉదానా ఒక సిక్స్‌ కొట్టాడు. చివరి ఓవర్‌లో ఆర్సీబీ 24 పరుగులు పిండుకుంది. దాంతో ఆర్సీబీ ఆరు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. మిగతా ఆర్సీబీ ఆటగాళ్లలో వాషింగ్టన్‌ సుందర్‌(13), ఉదాన(10 నాటౌట్‌; 1సిక్స్‌)లు ఫర్వాలేదనిపించారు. కింగ్స్‌ పంజాబ్‌ బౌలర్లలో మహ్మద్‌ షమీ, మురుగన్‌ అశ్విన్‌లు తలో  రెండు వికెట్లు సాధించగా, అర్షదీప్‌ సింగ్‌, క్రిస్‌ జోర్డాన్‌లు చెరో వికెట్‌ తీశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement