జడేజా గొప్ప ఆల్‌రౌండర్‌.. కచ్చితంగా ఆ పార్టీలోనే చేరతాడు

Ravindra Jadeja Truly Greatest All Rounder Will Join AAP: Kunal Kamra - Sakshi

న్యూఢిల్లీ: టీమిండియా ఆటగాడు రవీంద్ర జడేజా ప్రపంచంలోనే గొప్ప ఆల్‌రౌండర్‌ అని కితాబిచ్చారు స్టాండప్‌ కమెడియన్‌ కునాల్‌ కమ్రా. గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయన వ్యంగ్యంగా ఈ కమెంట్‌ చేశారు. అంతేకాదు క్రికెట్‌ నుంచి తప్పుకున్నాక జడేజా.. ఆమ్‌ ఆద్మీ పార్టీలో చేరతారని జోస్యం కూడా చెప్పారు. 


కచ్చితంగా జరిగేది ఇదే..

‘నిజంగా ప్రపంచంలోనే గొప్ప ఆల్ రౌండర్! భార్య రివాబా బీజేపీ టిక్కెట్‌పై పోటీకి దిగారు. సోదరి నయనాబా కాంగ్రెస్‌ పార్టీ తరపున ప్రచారం చేస్తున్నారు. నేను కచ్చితంగా చెప్పగలను రిటైర్మెంట్ తర్వాత రవీంద్ర జడేజా ఆప్‌లో చేరతార’ని కునాల్‌ కమ్రా ట్వీట్‌ చేశారు. ట్విటర్‌లో చురుగ్గా ఉండే కునాల్‌ తరచుగా వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ ఉంటారు. (క్లిక్ చేయండి: జడేజా కుటుంబంలో ‘ఫ్యామిలీ పాలిటిక్స్‌’)


పంత్‌కు పంచ్‌

ఇటీవల కాలంలో ఫామ్‌ కోల్పోయి వరుసగా విఫలమవుతున్న టీమిండియా వికెట్‌ కీపర్‌ రిషబ్ పంత్‌పై ట్విటర్‌లో తనదైన శైలిలో స్పందించారు కునాల్‌ కమ్రా. ‘రిషబ్ పంత్‌.. భారత్ జోడో యాత్రలో చేరి భారతదేశానికి సానుకూలంగా సహకరించాలని నేను అభ్యర్థిస్తున్నా’ అంటూ ట్వీట్‌ చేశారు. మాజీ ఆటగాడు, బీజేపీ ఎంపీ గౌతమ్‌ గంభీర్‌ గురించి ట్వీట్‌ చేస్తూ.. ‘ఒక వ్యక్తికి అన్ని క్రెడిట్‌లు దక్కకూడదని, అది జట్టు సమిష్టి కృషి అని 10 ఏళ్లుగా చెబుతూ వచ్చిన గౌతమ్ గంభీర్.. తర్వాత బీజేపీలో చేరాడ’ని పేర్కొన్నారు. 


ట్విటర్‌లో బర్త్‌ డే విషెస్‌ చెప్పండి!

భారత క్రికెట్‌ నియంత్రణ మండలి(బీసీసీఐ) కూడా కునాల్‌ వదిలిపెట్టలేదు. బీసీసీఐ తీరుపై ట్విటర్‌ సెటైర్‌ సంధించారు. ‘ఎవరైనా బీజేపీయేతర రాష్ట్రానికి చెందిన వారైతే, వారు ప్రతి కేంద్ర కేబినెట్ మంత్రికి ట్విటర్‌లో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయాలి. తద్వారా మీ ప్రతిభను బీసీసీఐ స్పష్టంగా చూడగలద’ని ట్వీట్‌ చేశారు. (క్లిక్ చేయండి: వీడియోలు, గేమింగ్, సోషల్‌మీడియా)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top