ఆఫ్ఘనిస్తాన్ స్టార్ ఆటగాడు రషీద్ ఖాన్కు కీలక పదవి దక్కింది. ప్రపంచ క్రికెటర్స్ అసోసియేషన్ (WCA) ప్లేయర్ అడ్వైజరీ బోర్డులో సభ్యుడిగా నియమితులయ్యాడు. ఈ విషయాన్ని WCA సీఈవో ఇవాళ (ఏప్రిల్ 14) ప్రకటించారు. WCA ప్లేయర్ అడ్వైజరీ బోర్డులో రషీద్తో పాటు చమారి ఆటపట్టు, డారిల్ మిచెల్, వేన్ మాడ్సెన్, మాడీ గ్రీన్ కూడా చోటు దక్కింది.
ఈ పదవిలో రషీద్ తదితరులు గ్లోబల్ క్రికెట్లో జరిగే విషయాలపై తమ అభిప్రాయాలను వెల్లడిస్తారు. WCA బోర్డు 2018లో ఏర్పడింది. ఐసీసీ ఈవెంట్లు, షెడ్యూలింగ్, కమర్షియల్ అంశాలపై ఆటగాళ్ల అభిప్రాయాలను ప్రతిబింబించడం ఈ బోర్డు ప్రధాన లక్ష్యం. ఇందులో 17 ప్రధాన క్రికెట్ దేశాల ఆటగాళ్లకు ప్రాతినిథ్యం ఉంది.
కొత్త బోర్డు సభ్యుల నియామకం తర్వాత WCA సీఈవో మాట్లాడుతూ.. ఆటగాళ్లు క్రికెట్ భవిష్యత్తుపై శ్రద్ధ చూపుతున్నారు. 2028 ఒలింపిక్స్లో క్రికెట్ పాల్గొనడం వంటి అంశాలపై చర్చలు జరిగాయి. ఆటగాళ్ల హక్కులు, అవకాశాలు, క్రికెట్ అభివృద్ధి కోసం వారు కలసి పనిచేయాలని కోరుకుంటున్నారని అన్నారు.
ఇదిలా ఉంటే, ప్రస్తుతం రషీద్ ఖాన్ ఐపీఎల్ 2026లో గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడుతున్నాడు. ఈ సీజన్లో అతను ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్ల్లో 5 వికెట్లు తీశాడు. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్పై (4-0-17-3) మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన చేసి, గతకొంతకాలంగా లేని ఫామ్ను దొరకబుచ్చుకున్నాడు. 2024లో వెన్ను శస్త్రచికిత్స తర్వాత రషీద్ ప్రభావం కాస్త తగ్గింది. ఈ సీజన్లో గుజరాత్ తమ తదుపరి మ్యాచ్లో కేకేఆర్తో తలపడనుంది. ఈ మ్యాచ్ ఏప్రిల్ 17న జరుగనుంది.


