ఐపీఎల్-2026 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ జోరును కొనసాగిస్తోంది. బుధవారం చిన్నస్వామి స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో ఆర్సీబీ విజయం సాధించింది. ఈ విజయంతో బెంగళూరు జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్ధానానికి చేరుకుంది.
ఈ మ్యాచ్లో ఆర్సీబీ ఆల్రౌండ్షో తో అదరగొట్టింది. తొలుత బౌలింగ్లో లక్నోను 146 పరుగులకే కట్టడి చేసిన ఆర్సీబీ.. అనంతరం ఆ స్వల్ప లక్ష్యాన్ని కేవలం 15.1 ఓవర్లలోనే ఊదిపడేసింది. ఇక ఈ అద్భుత విజయంపై మ్యాచ్ అనంతరం ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ స్పందించాడు. లక్నోను నామమాత్రపు స్కోర్కే పరిమితం చేసిన తమ బౌలర్లపై పాటిదార్ ప్రశంసల వర్షం కురిపించాడు.
"ఈ మ్యాచ్లో మా బౌలర్లు అద్భుతంగా రాణించారు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడం మాకు కలిసొచ్చింది. తొలుత ఫాస్ట్ బౌలర్లు పిచ్ కండీషన్స్ను ఉపయోగించుకుని బౌలింగ్ చేసిన తీరు అమోఘం. ఇక కృనాల్ ఒక ధైర్యవంతుడైన బౌలర్. అతడు బంతికి బంతికి వైవిధ్యం ప్రదర్శిస్తుంటాడు. అతడు తర్వాత ఏ బంతి వేస్తాడో కెప్టెన్గా నేను కూడా అంచనా వేయలేకపోతున్నా.
అతడితో పాటు సుయాశ్ శర్మ కూడా స్టంప్ టూ స్టంప్ బౌలింగ్ చేసి బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. అదేవిధంగా టీ20 లీగ్లలో భువనేశ్వర్, హాజిల్వుడ్ వంటి స్పెషలిస్ట్ బౌలర్లు జట్టులో ఉంటే కెప్టెన్ పని మరింత సులువు అవుతోంది. వారి అనుభవం జట్టులోని ఇతర బౌలర్లకు కూడా ఎంతో మేలు చేస్తోంది.
ఐపీఎల్ ప్రారంభం నుంచే ఆర్సీబీ ఫీల్డింగ్పై ప్రత్యేక దృష్టిపెట్టింది. ఇప్పుడు అదే స్పూర్తిని ఫిల్ సాల్ట్ కొనసాగిస్తున్నాడు. సాధారణంగానే అతడు ఒంటి చేత్తో గాల్లోకి ఎగిరి అద్భుతమైన క్యాచ్లను అందుకుంటాడు. ఈ రోజ్ కూడా సంచలన క్యాచ్ అందుకున్నాడు. మేము ప్రస్తుతానికి టైటిల్ గురించి ఆలోచించడం లేదన్నాడు. ఇదొక సుదీర్ఘ టోర్నీ. ప్రస్తుతం మా దృష్టి అంతా ఒక్కో మ్యాచ్పైనే ఉందని" పాటిదార్ పేర్కొన్నాడు. కాగా 49 పరుగులతో సత్తాచాటిన కోహ్లి గురుంచి పాటిదార్ మాట్లడకపోవడం గమనార్హం.
చదవండి: IPL 2026: సీఎస్కేకు ఘోర అవమానం.. ఆర్సీబీపై బీసీసీఐకి ఫిర్యాదు


