టీ20 ప్రపంచకప్-2016 ఛాంపియన్ వెస్టిండీస్కు ఐర్లాండ్ మహిళల జట్టు ఊహించని షాకిచ్చింది. ముక్కోణపు సిరీస్లో భాగంగా డబ్లిన్ వేదికగా జరిగిన విండీస్తో జరిగిన మ్యాచ్లో ఒక్క పరుగు (డక్ వర్త్ లూయిస్ పద్దతి) తేడాతో ఐర్లాండ్ విజయం సాధించింది. మహిళల టీ20ల్లో వెస్టిండీస్పై ఐర్లాండ్కు ఇదే తొలి విజయం కావడం విశేషం.
ఈ విజయంతో ఐర్లాండ్ ఫైనల్కు చేరుకునే అవకాశాలను మెరుగుపరుచుకుంది. ఐర్లాండ్ కెప్టెన్ ఓర్లా ప్రెండర్గాస్ట్ బౌలింగ్, బ్యాటింగ్ రెండింటిలోనూ అద్భుత ప్రదర్శన తన జట్టును ఒంటి చేత్తో గెలిపించింది. ఈ ఉత్కంఠ భరిత పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. కెప్టెన్ హేలీ మాథ్యూస్(1), టేలర్(9),డాటిన్(16) వంటి సీనియర్ ప్లేయర్లు నిరాశపరినప్పటికి.. ఆఖరిలో గ్లాస్కో(36) కాస్త దూకుడుగా ఆడడంతో విండీస్ కాస్త గౌరవప్రదమైన స్కోర్ సాధించింది.
ఐర్లాండ్ బౌలర్లలో కానింగ్, ప్రెండర్గాస్ట్ తలా రెండు వికెట్లు సాధించారు. ఐర్లాండ్ స్కోర్ 14.1 ఓవర్లలో 95/5 వద్ద ఉండగా ఆటకు వర్షం అంతరాయం కలిగించింది. అయితే ఆ సమయానికి డీఎల్ఎస్ పార్ స్కోరు ప్రకారం ఐర్లాండ్ 3 పరుగులు వెనుకబడి ఉంది. అంపైర్లు మ్యాచ్ను ఆపేసే ముందు కనీసం ఒక్క బంతి అయినా వేయాలని ఐర్లాండ్ బ్యాటర్లు పట్టుబట్టారు.
జాజారా క్లాక్స్టన్ వేసిన బంతి లూయిస్ లిటిల్ బ్యాట్ ఎడ్జ్ తీసుకుని థర్డ్ మ్యాన్ దిశగా బౌండరీకి వెళ్లింది. వర్షం తీవ్రత పెరగడంతో మ్యాచ్ను నిలిపివేశారు. అప్పటికి డీఎల్ఎస్ పద్ధతి ప్రకారం ఐర్లాండ్ 1 పరుగు ఆధిక్యంలో ఉండటంతో విజేతగా ప్రకటించారు. ఓర్లా ప్రెండర్గాస్ట్(46 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్సర్తో 71) అజేయంగా నిలిచింది.
చదవండి: 'వైభవ్ను ఇప్పుడే టీమిండియాకు సెలక్ట్ చేయొద్దు'


