పాకిస్తాన్ సూపర్ లీగ్-2026లో కరాచీ కింగ్స్ వరుసగా రెండో విజయం సాధించింది. ఆదివారం గడ్డాఫీ స్టేడియం వేదికగా లహోర్ ఖలందర్స్తో జరిగిన మ్యాచ్లో 4 వికెట్ల తేడాతో కరాచీ విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్లో హద్దు మీరి ప్రవర్తించిన కరాచీ కింగ్స్ స్పీడ్ స్టార్కు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు భారీ షాకిచ్చింది. నిబంధనలను ఉల్లంఘించినందుకు హసన్ అలీకి మ్యాచ్ ఫీజులో 10 శాతం జరిమానా పీసీబీ విధించింది.
ఏమి జరిగిందంటే?
లహోర్ ఇన్నింగ్స్ 19వ ఓవర్ వేసిన హసన్ అలీ.. చివరి బంతికి ప్రత్యర్ధి బ్యాటర్ హసీబుల్లా ఖాన్ను అద్భుతమైన బంతితో క్లీన్ బౌల్డ్ చేశాడు. అయితే ఈ సమయంలో హసన్ అలీ సెలబ్రేషన్స్ శ్రుతిమించాయి. హసీబుల్లాను అసభ్య పదజాలంతో దూషించడంతో పాటు దూకుడుగా సైగలు చేశాడు.
ఈ విషయాన్ని పీసీబీ సీరియస్గా తీసుకుంది. హసన్ ఆర్టికల్ 2.5ను ఉల్లంఘించినట్లు పాక్ క్రికెట్ బోర్డు తేల్చింది. హసన్ అలీ తన తప్పును అంగీకరించడంతో పీసీబీ కేవలం ఫైన్తోనే సరిపెట్టింది.
అయితే ఇదే మ్యాచ్లో లహోర్ స్టార్ ప్లేయర్ ఫఖర్ జమాన్ బాల్ టాంపరింగ్ పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు . చివరి ఓవర్లో కరాచీ విజయానికి 14 పరుగులు కావల్సిన సమయంలో, ఫఖర్ జమాన్ బంతి రూపాన్ని మార్చడానికి ప్రయత్నిస్తూ అంపైర్లకు దొరికిపోయాడు. అంపైర్లు వెంటనే బంతిని మార్చడమే కాకుండా, లాహోర్ జట్టుకు 5 పరుగుల పెనాల్టీ విధించారు. ఈ ఘటనసై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు విచారణ జరుపుతోంది.
చదవండి: IPL 2026: సూర్యను ఎందుకు పక్కన పెట్టారు..?


