IND vs ENG: ఇంగ్లండ్‌ కెప్టెన్‌పై మాజీ క్రికెటర్‌ ఫైర్‌! | Not rocket science: Former wicketkeeper slams England bowling tactics | Sakshi
Sakshi News home page

IND vs ENG: ఇంగ్లండ్‌ కెప్టెన్‌పై మాజీ క్రికెటర్‌ ఫైర్‌!

Jul 3 2026 12:12 PM | Updated on Jul 3 2026 12:31 PM

Not rocket science: Former wicketkeeper slams England bowling tactics

ఇంగ్లండ్‌తో తొలి టీ20లో టీమిండియా ఆదిలో తడబడినా మెరుగైన స్కోరు సాధించింది. చెస్టర్‌ లీ స్ట్రీట్‌ వేదికగా బుధవారం నాటి మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన భారత్‌ తొలుత బ్యాటింగ్‌ చేసిన సంగతి తెలిసిందే. ఓపెనర్లలో సంజూ శాంసన్‌ (1) మరోసారి విఫలం కాగా.. అభిషేక్‌ శర్మ మెరుపు హాఫ్‌ సెంచరీ (24 బంతుల్లో 59) సాధించాడు.

21 బంతుల్లో 42
వన్‌డౌన్‌లో వచ్చిన ఇషాన్‌ కిషన్‌ డకౌట్‌ కాగా.. కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ అర్ధ శతకం (47 బంతుల్లో 68)తో రాణించి.. అభిషేక్‌తో కలిసి ఇన్నింగ్స్‌ చక్కదిద్దాడు.  మిగిలిన వారిలో ఆల్‌రౌండర్‌ శివం దూబే దూకుడుగా ఆడాడు. కేవలం 21 బంతుల్లోనే రెండు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 42 పరుగులతో అజేయంగా నిలిచాడు.

ఫలితంగా భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 189 పరుగులు చేయగలిగింది. ఈ నేపథ్యంలో భారత మాజీ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ పార్థివ్‌ పటేల్‌ శివం దూబేపై ప్రశంసలు కురిపించాడు. టీమిండియా ఫినిషర్‌గా దూబే నిలకడగా రాణిస్తున్నాడని కొనియాడాడు.

అదే సమయంలో దూబే విషయంలో ఇంగ్లండ్‌ కెప్టెన్‌ హ్యారీ బ్రూక్‌ అనుసరించిన వ్యూహాలను పార్థివ్‌ పటేల్‌ విమర్శించాడు. స్టార్‌ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ.. ‘‘మ్యాచ్‌ స్వరూపాన్ని మార్చడానికి ఒక్క ఆటగాడు చాలు. టీమిండియా ఫినిషర్‌గా దూబే గత కొన్నాళ్లుగా ఇదే పని చేస్తున్నాడు. అతడు తన పాత్రను చక్కగా పోషించాడు.

ఇంగ్లండ్‌ వ్యూహం చెత్తగా ఉంది
కానీ ఇంగ్లండ్‌ వ్యూహమే చెత్తగా ఉంది. శివం దూబే బ్యాటింగ్‌కు వచ్చాడని తెలిసీ.. వాళ్లు స్పిన్నర్‌ లియామ్‌ డాసన్‌కు బంతిని ఇచ్చారు. ఇక 19వ ఓవర్లో కూడా స్పిన్నర్‌తోనే బౌలింగ్‌ వేయించారు. ఇదేమన్నా రాకెట్‌ సైన్సా?

శివం దూబే స్పిన్నర్ల బౌలింగ్‌లో చితక్కొడతాడన్న విషయం కూడా తెలియదా? ఐపీఎల్‌ చూస్తేనైనా ఈ విషయం అర్థం కావాలి. లేదంటే అంతర్జాతీయ మ్యాచ్‌లను పరిశీలించినా ఈ విషయం ఇట్టే తెలిసిపోతుంది.

స్పిన్‌ బౌలింగ్‌లో అతడికి ఉన్న రికార్డు గురించి ఆ మాత్రం తెలియదా?.. ఇంగ్లండ్‌ బౌలర్లకు అతడు చుక్కలు చూపించాడు. చక్కటి (200) స్ట్రైక్‌రేటుతో పరుగులు పిండుకున్నాడు’’ అని పార్థివ్‌ పటేల్‌ పేర్కొన్నాడు. కాగా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్- ఇంగ్లండ్‌ మధ్య బుధవారం రాత్రి జరిగిన తొలి టీ20 భారీ వర్షం కారణంగా రద్దైన సంగతి తెలిసిందే. 

మొదట టీమిండియా 20 ఓవర్లలో 7 వికెట్లకు 189 పరుగులు చేయగా... ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌కు దిగే అవకాశం ఇవ్వకుండా వర్షం దంచికొట్టింది. దీంతో మ్యాచ్‌ను రద్దు చేశారు. ఇరు జట్ల మధ్య శనివారం రెండో టీ20 జరగనుంది. ఇందుకు మాంచెస్టర్‌ వేదిక.

చదవండి: IND vs SL: టెస్టు సిరీస్‌ నుంచి కీలక ప్లేయర్‌ అవుట్‌!

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement