స్టోక్స్‌ సారధ్యంలో కొత్త జట్టును ప్రకటించిన ఈసీబీ | Nine Uncapped Players In England Revised Squad For Pakistan ODI Series | Sakshi
Sakshi News home page

ENG VS PAK: వారంతా ఐసోలేషన్‌లోకి.. కొత్త జట్టును ప్రకటించిన ఈసీబీ

Jul 6 2021 6:27 PM | Updated on Jul 6 2021 6:30 PM

Nine Uncapped Players In England Revised Squad For Pakistan ODI Series - Sakshi

లండన్: ఇంగ్లండ్ క్యాంపులో ఏడుగురు సభ్యులు కరోనా బారినపడ్డ నేపథ్యంలో పాకిస్తాన్‌తో సిరీస్‌ నిమిత్తం 18 మంది సభ్యులతో కూడిన నూతన జట్టును ఇంగ్లండ్ అండ్‌ వేల్స్‌ క్రికెట్ బోర్డు(ఈసీబీ) ప్రకటించింది. కోవిడ్‌ బారిన పడ్డ ఆటగాళ్లతో సన్నిహితంగా ఉన్న జట్టు సభ్యులందరినీ ఐసోలేషన్‌కు తరలించిన ఈసీబీ.. పూర్తిగా కొత్త జట్టును ప్రకటించింది. ఇందులో ఏకంగా తొమ్మిది మంది అన్‌ క్యాప్డ్‌ ప్లేయర్లను ఎంపిక చేసింది. శ్రీలంకతో పరిమిత ఓవర్ల సిరీస్‌కు దూరమైన బెన్ స్టోక్స్‌కు యువ జట్టు సారథ్య బాధ్యతలు అప్పగించింది. కాగా, ముందుగా ప్రకటించిన ఇంగ్లండ్‌ జట్టు సభ్యులకు సోమవారం బ్రిస్టల్‌లో ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించింది. 

ఇందులో ముగ్గురు ఆటగాళ్లు, నలుగురు మేనేజ్‌మెంట్ సిబ్బందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయ్యింది. దీంతో జట్టు మొత్తాం ఐసోలేషన్‌లో ఉండాలని ఈసీబీ ఆదేశించింది. మరోవైపు కొత్తగా ఎంపికైన యువకులకు ఇది సువర్ణావకాశమని, తమ ప్రతిభను నిరూపించుకునేందుకు వారికి సరైన ప్లాట్‌ఫామ్‌ దొరికిందని ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్, ప్రస్తుత బోర్డు మేనేజింగ్ డైరెక్టర్ ఆష్లే గిల్స్ పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే, ఇంగ్లండ్-పాకిస్థాన్ మధ్య మూడు వన్డేల సిరీస్ ఈ నెల 8 నుంచి ప్రారంభం కానుంది. 

ఇంగ్లండ్‌ జట్టు: బెన్‌ స్టోక్స్‌(కెప్టెన్‌), జేక్‌ బాల్‌, డానీ బ్రిగ్స్‌, బ్రైడాన్‌ కార్స్‌, జాక్‌ క్రాలీ, బెన్‌ డక్కెట్‌, లూయిస్‌ గ్రెగరి, టామ్‌ హెల్మ్‌, విల్‌ జాక్స్‌, డేనియల్‌ లారెన్స్‌, సకీబ్‌ మహమూద్‌, డేవిడ్‌ మలాన్‌, క్రెయిగ్‌ ఒవర్టన్‌, మాట్‌ పార్కిన్సన్‌, డేవిడ్‌ పెయిన్‌, ఫిల్‌ సాల్ట్‌, జాన్‌ సింప్సన్‌, జేమ్స్‌ విన్స్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement