భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వైఫల్యాల పరంపర ఐపీఎల్ 2026 తర్వాత కూడా కొనసాగుతోంది. క్యాష్ రిచ్ లీగ్ తర్వాత ఆడిన తొలి మ్యాచ్లోనే ఈ ముంబై ఇండియన్స్ విధ్వంసకర బ్యాటర్ చేతులెత్తేశాడు. ముంబై టీ20 లీగ్లో ట్రయంప్స్ నైట్స్ ఎంఎన్ఈకి ఆడుతున్న స్కై.. నార్త్ ముంబై పాంథర్స్తో జరిగిన మ్యాచ్లో 11 బంతుల్లో 19 పరుగులు (4 ఫోర్లు) మాత్రమే చేసి ఔటయ్యాడు.
తాజా వైఫల్యం తర్వాత స్కై టీమిండియా భవిష్యత్తు మరోసారి చర్చనీయాంశంగా మారింది. స్కైను భారత టీ20 జట్టు కెప్టెన్సీ నుంచి తొలగించడమే కాకుండా, జట్టు నుంచి కూడా తప్పించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ముంబై ఇండియన్స్ సైతం స్కైకు ప్రత్యామ్నాయాన్ని వెతుక్కోవాలని ఫ్యాన్స్ సూచిస్తున్నారు.
స్కై గతకొంతకాలంగా టీ20 ఫార్మాట్లో దారుణంగా విఫలమవుతున్నాడు. ఐపీఎల్ 2026 అతడు 13 మ్యాచ్ల్లో కేవలం రెండు సార్లు మాత్రమే హాఫ్ సెంచరీ మార్కు తాకాడు. అంతకుముందు టీమిండియా ఛాంపియన్గా నిలిచిన టీ20 వరల్డ్కప్లోనూ ఘోరంగా విఫలమయ్యాడు. 9 మ్యాచ్ల్లో కేవలం ఒకే ఒక హాఫ్ సెంచరీ చేశాడు. అది కూడా పసికూన యూఎస్ఏపై.
ఈ వరుస వైఫల్యాల నేపథ్యంలో స్కైకు వ్యతిరేకులు ఎక్కువయ్యారు. తాజా వైఫల్యం తర్వాత సోషల్ మీడియాలో అభిమానుల స్పందనలు వైరల్గా మారాయి. కొందరు అతడికి మద్దతుగా నిలబడుతుంటే.. మరికొందరు వ్యతిరేకంగా భారీ క్యాంపెయినింగ్ చేస్తున్నారు.
ముంబై టీ20 లీగ్లో స్కై వైఫల్యం అతడి జట్టు కొంప ముంచింది. కీలక దశలో ఔట్ కావడంతో అతడి జట్టు ఓటమిపాలైంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన స్కై ప్రత్యర్ది జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 209 పరుగుల భారీ స్కోర్ చేసింది.
అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన స్కై జట్టు నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 188 పరుగులకే పరిమితమై, 21 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. ముంబై టీ20 లీగ్లో స్కైతో పాటు చాలామంది టీమిండియా స్టార్లు పాల్గొంటున్న విషయం తెలిసిందే.


