ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మాజీ చైర్మన్ లలిత్ మోదీ లక్నో సూపర్జెయింట్స్ ప్రాంచైజీ యజమాని సంజీవ్ గోయెంకాపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ చరిత్రలోనే సంజీవ్ గోయెంకా అత్యంత చెత్త యజమాని అని, అతడో మాట తప్పిన మూర్ఖుడిగా అభివర్ణించాడు. నిలకడ లేని వక్తి ఎవరైనా ఉన్నారంటే అది సంజీవ్ గోయెంకానే అంటూ ఘాటుగా పేర్కొన్నాడు. ‘హ్యూమన్స్ ఆఫ్ బాంబే’ పాడ్కాస్ట్ ఇంటర్య్వూలో లలిత్ మోదీ ఈ వ్యాఖ్యలు చేశాడు.
లలిత్ మోదీ మాట్లాడుతూ.. ‘అతడికి (గోయెంకా) ఒక ఫ్రాంచైజీని కొనడం కానీ, నడిపించే హక్కు కానీ లేదు. సంజీవ్ గోయెంకా ఒక బిజినెస్ మైండ్ కలిగిన వ్యక్తి. తన విద్యుత్ వ్యాపారానికి పరిమితమవ్వాల్సింది. అనవసరంగా ఐపీఎల్లో ఫ్రాంచైజీని కొని చేతులు కాల్చుకున్నాడు. లక్నో సూపర్జెయింట్స్ను కొనుగోలు చేయడం వల్ల ఐపీఎల్ రేటింగ్ తగ్గుదలకు సంజీవ్ కారణమయ్యాడు.
లక్నో జట్టు కూడా ప్రతీ సీజన్లో పేలవమైన ప్రదర్శననే కనబరుస్తూ వస్తోంది. ఈసారి కూడా లక్నో ఒట్టి చేతులతోనే లీగ్ నుంచి నిష్క్రమించడంతో సంజీవ్ గోయెంకా మీమర్స్కు దొరికిపోయారు. ఇప్పుడాయన ఒక మీమ్ కింగ్ అయిపోయారు.’ అంటూ లలిత్ మోదీ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.
గోయెంకాపై వచ్చిన మీమ్స్లో అత్యధిక మంది చూసిన మీమ్కు కృతజ్ఞతగా రోలెక్స్ వాచీని బహుమతిగా ఇస్తానని లలిత్ మోదీ ఆఫర్ చేయడం గమనార్హం. ఇక అవకాశం దొరికినప్పుడల్లా సంజీవ్ గోయెంకాపై లలిత్ మోదీ వ్యంగ్యాస్త్రాలు సంధించడం పరిపాటిగా మారిపోయింది.
ఈ సీజన్లో ఒక మ్యాచ్లో ఓటమి చెందడంపై జట్టు మాజీ కెప్టెన్ రిషబ్ పంత్తో సంజీవ్ గోయెంకా వాడీ వేడీ చర్చ జరపడంపై లలిత్ మోదీ కౌంటర్ ఇచ్చాడు. అయితే సీజన్లో లక్నో ఆట ముగిసిన తర్వాత ఆ జట్టు పంత్ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది.
ఈ పరిణామంపై స్పందించిన లలిత్ మోదీ.. ‘పంత్కు దీర్ఘకాలం అండగా ఉంటానన్న ఒక పెద్ద మనిషి (సంజీవ్ గోయెంకా) తన వాగ్ధానాన్ని నిలబెట్టుకోవడంలో విఫలమయ్యాడు’ అంటూ విమర్శలు సంధించాడు. ఐపీఎల్ 2026 సీజన్లో లక్నో సూపర్జెయింట్స్ దారుణ ఆటతీరు కనబరిచింది. సీజన్లో 14 మ్యాచ్లాడిన లక్నో కేవలం 4 విజయాలు మాత్రమే సాధించి పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది.


