ఐపీఎల్-2026లో లక్నో సూపర్ జెయింట్స్కు ఏది కలిసి రావడం లేదు. వరుస ఓటములతో సతమతమవుతున్న లక్నోకు మరో భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ జోష్ ఇంగ్లిష్ మిగిలిన సీజన్కు దూరమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. సోమవారం ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో ఫీల్డింగ్ చేస్తుండగా ఇంగ్లిష్ చేతి బోటన వేలికి గాయమైంది.
దీంతో ఆట మధ్యలోనే అతడు ఫిజియో సాయంతో మైదానాన్ని వీడాడు. అయితే ఇంగ్లిష్కు తగిలిన గాయం తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో మిగిలిన మ్యాచ్లకు అతడు అందుబాటులో ఉండకపోవచ్చు అని ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయి. కాగా ఆస్ట్రేలియన్ వికెట్ కీపర్ బ్యాటర్ అయిన జోష్ ఇంగ్లిష్ ఈ ఏడాది సీజన్లో కేవలం ఒకే ఒక మ్యాచ్ మాత్రమే ఆడాడు.
అతడిని గతేడాది వేలంలో రూ. 8.60 కోట్ల భారీ ధరకు లక్నో కొనుగోలు చేసింది. కానీ అతడు వ్యక్తిగత కారణాల చేత ఫస్ట్ హాఫ్ సీజన్కు అందుబాటులో లేడు. ఇటీవల జట్టుతో కలిసిన జోష్.. ముంబై ఇండియన్స్తో తన మొదటి మ్యాచ్ ఆడాడు.
ఓపెనర్గా అతడిని ఎల్ఎస్జీ ప్రమోట్ చేసింది. కానీ అతడు తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకోలేకపోయాడు. కేవలం 13 పరుగులు మాత్రమే చేసి అతడు ఔటయ్యాడు. ఇప్పుడు అతడు గాయపడడంతో ఆ స్ధానాన్ని ఆయూశ్ బదోనితో భర్తీ చేసే అవకాశముంది.
ఇక ఇప్పటివరకు తొమ్మిది మ్యాచ్లు ఆడిన లక్నో సూపర్ జెయింట్స్.. కేవలం రెండింట మాత్రమే విజయం సాధించింది. రిషబ్ పంత్ సారథ్యంలోని లక్నో జట్టు ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆఖరి స్ధానంలో ఉంది.
చదవండి: IPL 2026: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్.. 19 ఏళ్లలో ఒకే ఒక్కడు


