ఐపీఎల్-2026 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ మరోసారి అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఈ ధనాధన్ లీగ్లో భాగంగా మంగళవారం అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో శాంసన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.
156 పరుగుల లక్ష్య చేధనలో ఢిల్లీ బౌలర్లను సంజూ ఉతికారేశాడు. కేవలం 52 బంతుల్లోనే 7 ఫోర్లు, 4 సిక్స్లతో 87 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. ఈ అద్భుత ఇన్నింగ్స్కు గాను అతనికి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభించింది. ఈ సీజన్లో ఢిల్లీపై శాంసన్కు ఇది రెండో 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు కావడం విశేషం.ఇక ఈ మ్యాచ్లో తుపాన్ ఇన్నింగ్స్ ఆడిన శాంసన్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.
సంజూ సాధించిన రికార్డులు ఇవే
👉19 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ క్యాపిటల్స్పై ఒకే సీజన్లో 200 కంటే ఎక్కువ పరుగులు చేసిన తొలి ఆటగాడిగా శాంసన్ రికార్డు సృష్టించాడు. ఈ సీజన్లో ఢిల్లీపై ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ కలిపి అతడు 202 పరుగులు చేశాడు. ఈ రెండు మ్యాచ్లలోనూ సంజూ అజేయంగా నిలవడం గమానార్హం.
👉అదేవిధంగా ఐపీఎల్ చరిత్రలో ఒకే సీజన్లో ఒకే జట్టుపై రెండుసార్లు 100 లేదా అంతకంటే ఎక్కువ భాగస్వామ్యాలు నెలకొల్పిన తొలి బ్యాటర్గా సంజూ నిలిచాడు. ఈ ఏడాది ఐసీజన్ ఫస్ట్ హాఫ్లో ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో శాంసన్,ఆయుశ్ మాత్రేతో కలిసి 113 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.
👉ఇప్పుడు నిన్న జరిగిన మ్యాచ్లో కార్తీక్ శర్మ (31 బంతుల్లో 41 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు)తో కలిసి 3వ వికెట్కు 66 బంతుల్లో 114 పరుగులు అజేయ భాగస్వామ్యాన్ని జోడించాడు. రుతురాజ్ గైక్వాడ్ కూడా ఢిల్లీపై రెండుసార్లు 100 లేదా అంతకంటే ఎక్కువ భాగస్వామ్యాలు నెలకొల్పాడు. కానీ అతడు రెండు సీజన్లలో ఈ ఫీట్ సాధించాడు.
👉ఒకే సీజన్లో ఒకే ప్రత్యర్థిపై 200 కంటే ఎక్కువ పరుగులు చేసిన తొలి వికెట్ కీపర్ సంజూనే కావడం విశేషం.
చదవండి: హెచ్సీఏ ‘క్రికెట్ ఆపరేషన్స్ హెడ్’గా రాయుడు


