సాక్షి, హైదరాబాద్: భారత మాజీ క్రికెటర్ అంబటి తిరుపతి (ఏటీ) రాయుడును హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) ‘క్రికెట్ ఆపరేషన్స్ హెడ్’గా నియమించింది. హెచ్సీఏలో క్రికెట్ కార్యకలాపాలను రాయుడు పర్యవేక్షించనున్నట్లు హెచ్సీఏ అపెక్స్ కౌన్సిల్ మంగళవారం వెల్లడించింది. అంతర్జాతీయ క్రికెట్లో రాయుడుకున్న అపార అనుభవం... హైదరాబాద్ యువ క్రికెటర్లకు ఎంతగానో ఉపయోగపడుతుందని అపెక్స్ కౌన్సిల్ భావిస్తోంది.
పరిపాలనలో పారదర్శకతతో పాటు క్రికెట్ నైపుణ్యాలను పెంపొందించాలనే లక్ష్యంతో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు హెచ్సీఏ కార్యదర్శి జీవన్ రెడ్డి పేర్కొన్నారు. ఆటకు సంబంధించిన అన్ని కార్యకలాపాల్లో సమగ్రత పెంపొందించేందుకు అవినీతి నిరోధక విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దీనికి పి.విజేందర్ చైర్మన్గా వ్యవహరిస్తారు. ఈనెల 12 నుంచి 2026–27 క్రికెట్ సీజన్ మొదలవుతుందని.... హెచ్సీఏ అకాడమీని పునరుద్ధరించి మౌలిక వసతులు పెంపొందిస్తామని... లైంగిక వేధింపుల నివారణకు కమిటీని ఏర్పాటు చేసినట్లు హెచ్సీఏ కార్యదర్శి తెలిపారు.


