ఐపీఎల్-2026 సీజన్ సంబంధించిన ఫ్లే ఆఫ్స్ షెడ్యూల్ను బీసీసీఐ బుధవారం ప్రకటించింది. ఈ ఏడాది సీజన్ ఫైనల్ మ్యాచ్ మే 31న అహ్మదాబాద్ వేదికగా జరగనుంది. వాస్తవానికి డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు హోం గ్రౌండ్ అయిన చిన్నస్వామి స్టేడియంలో జరగాల్సి ఉండేది.
కానీ స్ధానిక క్రికెట్ అసోసియేషన్, అధికారుల నుంచి వచ్చిన కొన్ని డిమాండ్లు బోర్డు గైడ్లైన్స్, ప్రోటీకాల్స్కు లోబడి లేకపోవడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. ఇక పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న రెండు జట్ల మధ్య జరిగే 'క్వాలిఫైయర్ 1' మ్యాచ్ మే 26న ధర్మశాల వేదికగా జరగనుంది.
ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్కు అర్హత సాధిస్తోంది. ఇందులో ఓడిన జట్టు మే 29న ముల్లాన్పూర్ వేదికగా ఎలిమినేటర్లో తలపడనుంది. అంతకంటే ముందు మే 27న ఇదే ముల్లాన్పూర్లో క్వాలిఫయర్-2 జరగనుంది. కాగా ఈ క్యాష్ లీగ్ సీజన్ లీగ్ స్టేజ్ మ్యాచ్లు ఆఖరి దశకు చేరుకున్నాయి.
మొత్తం 70 లీగ్ మ్యాచ్లలో ఇప్పటికే 48 ముగియగా, ఇక మిగిలిన 22 లీగ్ మ్యాచ్లు ప్లేఆఫ్స్ రేసును నిర్ణయించనున్నాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో పంజాబ్ కింగ్స్, ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్, రాజస్తాన్ తొలి నాలుగు స్ధానాల్లో ఉన్నాయి.
ఫైనల్ వేదిక మార్పునకు కారణమిదే
కాగా గతేడాది ఆర్సీబీ తొలిసారి ఐపీఎల్ టైటిల్ గెలిచిన అనంతరం చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన వేడుకల్లో భారీ తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోగా, అనేకమంది గాయపడ్డారు. ఈ ఘటనపై విచారణ జరిపిన జస్టిస్ కున్హా కమిషన్, స్టేడియం భద్రత, నిర్వహణలో పలు లోపాలను ఎత్తిచూపింది.
దీంతో దాదాపు 10 నెలల పాటు చిన్నస్వామి స్టేడియంలో ఎలాంటి మ్యాచ్లు జరగలేదు. అయితే భారత మాజీ క్రికెటర్ వెంకటేష్ ప్రసాద్ కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (KSCA) ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టడంతో మళ్లీ చిన్నస్వామి స్టేడియంలో క్రికెట్ సందడి మొదలైంది.
స్టేడియంలో యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయడంతో.. ఐపీఎల్-2026 మ్యాచ్లను నిర్వహించేందుకు కర్ణాటక సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయినప్పటికి బీసీసీఐ భద్రతా ప్రోటోకాల్స్ విషయంలో ఇంకా ఆసంతృప్తిగానే ఉంది. ఈ క్రమంలోనే బీసీసీఐ వేదికను బెంగళూరు నుంచి అహ్మదాబాద్కు మార్చింది. గతేడాది సీజన్ ఫైనల్ కూడా అహ్మదాబాద్ వేదికగా జరగనుంది.
చదవండి: IPL 2026: 'అతని గురించి ఎంత చెప్పినా తక్కువే.. అది మా అదృష్టం'


