ఐపీఎల్-2026 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ మరో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. మంగళవారం అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో సీఎస్కే గెలుపొంది. ఈ మ్యాచ్లో చెన్నై జట్టు ఆల్రౌండ్ షోతో అదరగొట్టింది.
తొలుత హోం టీమ్ ఢిల్లీని 155 పరుగులకే కట్టడి చేసిన సీఎస్కే.. అనంతరం లక్ష్యాన్ని కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 17.3 ఓవర్లలో చేధించింది. సీఎస్కే విజయంలో సంజూ శాంసన్(87 నాటౌట్), కార్తీక్ శర్మ(41) మరోసారి కీలక పాత్ర పోషించారు. ఇక ఈ విజయంపై మ్యాచ్ అనంతరం సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ స్పందించాడు.
"గత ఏడాది కంటే ఈసారి మా జట్టు బలంగా ఉందని మేము ఆదిలోనే భావించాం. ముఖ్యంగా సంజూ శాంసన్ వంటి కీలక ఆటగాడు రావడంతో మా అన్ని విభాగాలు పటిష్టమయ్యాయి. మా మిడిలార్డర్ బ్యాటింగ్ కూడా బలంగా ఉంది. కార్తీక్ శర్మ యువ ఆటగాళ్లు రాణిస్తుండడం చాలా సంతోషంగా ఉంది.
మరోవైపు మా బౌలింగ్ విభాగం నిలకడగా రాణిస్తోంది. అన్షుల్ కాంబోజ్, అకిల్, నూర్, ఓవర్టన్ వంటి బౌలర్లు చక్కగా బౌలింగ్ చేస్తున్నారు. ఈ ఒక్క మ్యాచ్లోనే అన్షుల్ విఫలమయ్యాడు. అందుకు అతడు బాధపడ్డాడు. అతడు బలంగా తిరిగి వస్తాడన్న నమ్మకం మాకు ఉంది.
ఇక టోర్నీ ఆరంభంలో కాస్త తడబడ్డాం. మా ఊపును అందుకోవడానికి ఒక్క విజయం అవసరమైంది. మూడు మ్యాచ్ల తర్వాత మాకు మూమెంటమ్ లభించింది. ఆ తర్వాత నుంచి జట్టు మొత్తం సమిష్టిగా రాణించడం మొదలుపెట్టాము. సంజూ గురుంచి ప్రత్యేక చెప్పాల్సిన అవసరం లేదు.
ప్రపంచకప్లో అద్భుత ఫామ్ను కనబరిచిన సంజూ, ఇప్పుడు మా జట్టుకు వెన్నెముకలా మారాడు. అతను జట్టులో ఉండటం మా అదృష్టం. యంగ్ ప్లేయర్ కార్తీక్ శర్మలో కూడా అద్భుతమైన స్కిల్స్ ఉన్నాయి. ప్రత్యేకంగా నేర్చుకోవాల్సిందంటూ ఏమి లేదు. అతడికి భారీ షాట్లతో పాటు స్ట్రైక్ను రొటేట్ చేస్తూ ఆడే సత్తా కూడా ఉంది" అని పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్లో గైక్వాడ్ పేర్కొన్నాడు.
చదవండి: IPL 2026: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్.. 19 ఏళ్లలో ఒకే ఒక్కడు


