సీఎస్కే యువ బ్యాటర్, అండర్ 19 వరల్డ్కప్ విన్నింగ్ కెప్టెన్ ఆయుశ్ మాత్రే చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్లో సీఎస్కే తరఫున హాఫ్ సెంచరీ చేసిన అతి పిన్నవయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్ 2026లో భాగంగా పంజాబ్ కింగ్స్తో ఇవాళ (ఏప్రిల్ 3) జరుగుతున్న మ్యాచ్లో ఈ ఘనత సాధించాడు.
ఈ మ్యాచ్కు ముందు వరకు ఈ రికార్డు సురేశ్ రైనా పేరిట ఉండేది. రైనా ఐపీఎల్ అరంగేట్రం ఎడిషన్లో (2008) 21 ఏళ్ల 148 రోజుల వయసులో అర్ద సెంచరీ చేశాడు. తాజాగా మాత్రే 18 కిందటి ఆ రికార్డును బద్దలు కొడుతూ 18 రోజుల 261 రోజుల వయసులో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఈ విభాగంలో మాత్రే, రైనా తర్వాతి స్థానంలో పార్థివ్ పటేల్ (23 ఏళ్ల 76 రోజుల, 2008) ఉన్నాడు.
ఈ హాఫ్ సెంచరీతో మాత్రే మరో ఘనత కూడా సొంతం చేసుకున్నాడు. ఈ హాఫ్ సెంచరీ అతనికి ఐపీఎల్లో రెండవది. తద్వారా 19 ఏళ్లలోపు ఐపీఎల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో పృథ్వీ షాతో (2) కలిసి రెండో స్థానంలో నిలిచాడు.
ఈ విభాగంలో రాజస్థాన్ రాయల్స్ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ అగ్రస్థానంలో ఉన్నాడు. గత ఎడిషన్లోనే ఐపీఎల్ అరంగేట్రం చేసిన వైభవ్ ఇప్పటికే 3 అర్ద సెంచరీలు చేశాడు. కొద్ది రోజుల కిందటే వైభవ్ 15వ పడిలోకి అడుగుపెట్టన విషయం తెలిసిందే.
మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన సీఎస్కే భారీ స్కోర్ దిశగా సాగుతోంది. ఆదిలోనే సంజూ శాంసన్ (7) వికెట్ కోల్పోయినా, ఆయుశ్ మాత్రే ధాటిగా ఆడి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. 29 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన అతను.. మొత్తంగా 43 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 73 పరుగులు చేసి ఔటయ్యాడు. 16 ఓవర్ల తర్వాత సీఎస్కే స్కోర్ 156-4గా ఉంది. శివమ్ దూబే (14), సర్ఫరాజ్ ఖాన్ (20) క్రీజ్లో ఉన్నారు.


