ఐపీఎల్‌-2023కి సంబంధించి కీలక అప్‌డేట్‌

IPL 2023: BCCI Sets December 15 As Deadline For Players To Register For Auction - Sakshi

ఐపీఎల్‌-2023 సీజన్‌కు సంబంధించిన ఓ కీలక అప్‌డేట్‌ వచ్చింది. కొచ్చి వేదికగా డిసెంబర్‌ 23న జరుగనున్న మినీ వేలంలో పాల్గొనాలకున్న ఆటగాళ్లకు బీసీసీఐ డెడ్‌లైన్‌ విధించింది. వేలం బరిలో ఉండాలనుకే ఆటగాళ్లు డిసెంబర్‌ 15లోగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని బీసీసీఐ ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్‌ 15 సాయంత్రం 5 గంటలలోగా ఆటగాళ్లు తమ పేర్లను ఎన్‌రోల్‌ చేసుకోకపోతే, మినీ వేలానికి వారు అనర్హులని ప్రకటించింది. 

కాగా, మినీ వేలానికి ముందు జరగాల్సిన ఆటగాళ్ల రిటెన్షన్‌, రిలీజ్‌, ట్రేడింగ్‌ ప్రక్రియ ఈనెల 15న ముగిసిన విషయం తెలిసిందే. ఆయా ఫ్రాంచైజీలు తమకు కావల్సిన ఆటగాళ్లను అట్టిపెట్టుకుని, వద్దనుకున్న వారిని వేలానికి వదిలిపెట్టాయి. ఇక మిగిలింది వేలం తంతు మాత్రమే. 10 ఫ్రాంచైజీలు విడుదల చేసిన ఆటగాళ్లతో కలుపుకునే మొత్తం 250 మంది వరకు వేలంలో పాల్గొనవచ్చని బీసీసీఐ అంచనా వేస్తుంది.

టీ20 వరల్డ్‌కప్‌-2022 హీరోలు, ఇంగ్లండ్‌ ఆటగాళ్లు బెన్‌ స్టోక్స్‌, ఆదిల్‌ రషీద్‌ వేలంలో ఇప్పటికే తమ పేర్లు నమోదు చేసుకోగా.. కొత్తగా ఇంగ్లండ్‌ టెస్ట్‌ ఆటగాడు జో రూట్‌ కూడా తన పేరును ఎన్‌రోల్‌ చేసుకున్నాడు. వరల్డ్‌కప్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌ సామ్‌ కర్రన్‌, ఆసీస్‌ యువ ఆల్‌రౌండర్‌ కెమరూన్‌ గ్రీన్‌, సికందర్‌ రాజా లాంటి స్టార్లు తమ పేర్లు నమోదు చేసుకుంటారని సమాచారం.

వరల్డ్‌కప్‌లో సత్తా చాటిన ఆటగాళ్ల కోసం తీవ్ర పోటీ ఉండనున్న నేపథ్యంలో పర్స్‌ వ్యాల్యూ మరికొంత పెంచాలని అన్ని ఫ్రాంచైజీలు డిమాండ్‌ చేస్తున్నాయి. మరోవైపు క్రిస్మస్‌ దృష్ట్యా వేలం తేదీని కూడా ముందుకు జరపాలని ఫ్రాంచైజీలు బీసీసీఐని పట్టుబడుతున్నాయి. 

ప్రస్తుతానికి ఆయా ఫ్రాంచైజీల పర్స్‌లో ఉన్న డబ్బు ఎంతంటే.. 
సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌- 42.25 కోట్లు
పంజాబ్‌ కింగ్స్‌-32.20 కోట్లు
లక్నో సూపర్‌ జెయింట్స్‌-23.35 కోట్లు
ముంబై ఇండియన్స్‌-20.55 కోట్లు
చెన్నై సూపర్‌కింగ్స్‌-20.45కోట్లు
ఢిల్లీ క్యాపిటల్స్‌-19.45 కోట్లు
గుజరాత్‌ టైటాన్స్‌-19.25 కోట్లు
రాజస్థాన్‌ రాయల్స్‌-13.20 కోట్లు
రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు-8.75 కోట్లు
కోల్‌కతా నైట్‌రైడర్స్‌-7.05 కోట్లు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top