ఐపీఎల్-2026 మధ్యలో గుజరాత్ టైటాన్స్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. గాయం కారణంగా ఈ ఏడాది సీజన్కు దూరమైన ఇంగ్లండ్ ఆటగాడు టామ్ బాంటన్ స్థానాన్ని దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ బ్యాటర్ కానర్ ఎస్టర్హుయిజెన్తో గుజరాత్ భర్తీ చేసింది. ఈ విషయాన్ని గుజరాత్ టైటాన్స్ ఎక్స్ వేదికగా ధ్రువీకరించింది.
గతేడాది జరిగిన మినీ వేలంలో టామ్ బాంటన్ను రూ.2 కోట్ల బేస్ప్రైస్కు కొనుగోలు చేసింది. కానీ ఈ ఏడాది సీజన్ ఆరంభానికి ముందు ప్రాక్టీస్ సెషన్లో బాంటన్ చేతి వేలికి గాయమైంది. దీంతో అతడు గుజరాత్ ఆడిన తొలి నాలుగు మ్యాచ్లకు దూరమయ్యాడు. అయితే బాంటన్ తన గాయం నుంచి కోలుకోవడానికి మరింత సమయం పట్టనుండడంతో.. ఇప్పుడు మొత్తం సీజన్కే దూరమయ్యాడు. ఈ క్రమంలోనే ఎస్టర్హుయిజెన్ రూ. 75 లక్షలకు గుజరాత్ టైటాన్స్ సొంతం చేసుకుంది
ఎవరీ ఎస్టర్హుయిజెన్?
24 ఏళ్ల కానర్ ఎస్టర్హుయిజెన్ గత నెలలో న్యూజిలాండ్తో జరిగిన టీ20 సిరీస్తో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. తన మొదటి సిరీస్లోనే అద్బుత ప్రదర్శలనతో అందరిని ఆకట్టుకున్నాడు. 5 మ్యాచ్లలో 145.98 స్ట్రైక్ రేట్తో 200 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు.
అతడికి అద్బుతమైన హిట్టింగ్ స్కిల్స్ ఉన్నాయి. అతడి రాకతో గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ విభాగం మరింత పటిష్టం కానుంది. జోస్ బట్లర్కు బ్యాకప్ వికెట్ కీపర్గా ఎస్టర్హుయిజెన్ ఉండనున్నాడు. ఈ ఏడాది సీజన్లో గుజరాత్ ఇప్పటివరకు నాలుగు మ్యాచ్లు ఆడి రెండింట విజయం సాధించింది. గిల్ సేన ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆరో స్ధానంలో కొనసాగుతోంది.
చదవండి: IPL 2026: వరుస ఓటములు.. హార్దిక్ పాండ్యా సంచలన నిర్ణయం!


