అంద‌రికంటే ముందుగా యూఏఈకి చెన్నై జ‌ట్టు

Chennai Super Kings Aiming To Begin IPL Camp In UAE From Early August - Sakshi

చెన్నై: ఐపీఎల్‌లో అత్యంత విజ‌య‌వంత‌మైన జ‌ట్టుగా పేరు పొందిన చెన్నై సూప‌ర్ ‌కింగ్స్ ఐపీఎల్ 13వ సీజ‌‌న్‌కు అంద‌రికంటే ముందుగా స‌మాయ‌త్త‌మ‌వుతుంది. ఈసారి ఐపీఎల్ దుబాయ్‌లో జ‌ర‌గ‌నున్న సంగ‌తి తెలిసిందే.అందుకు సంబంధించి ప్రిప‌రేష‌న్ ప్లాన్‌ను ఆగ‌స్టు మొద‌టి వారంలోనే మొద‌లుపెట్ట‌నుంది. ఆగస్టు 10నే యూఏఈకి వెళ్లేందుకు చెన్నై సూపర్‌కింగ్స్‌ సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ విషయాన్ని తమ ఆటగాళ్లకు తెలియజేసింది. అయితే చెన్నై జ‌ట్టులో ఉన్న ఆట‌గాళ్లంద‌రూ ముందుగా చెన్నైకు వ‌చ్చి రిపోర్ట్ చేయనున్న‌ట్లు సీఎస్‌కే యాజ‌మాన్యం తెలిపింది. భార‌త ప్ర‌భుత్వం నుంచి అనుమ‌తి వ‌చ్చిన త‌ర్వాత ప్ర‌త్యేక చార్ట‌ర్ విమానంలో ఆట‌గాళ్ల‌ను దుబాయ్‌కు పంప‌నున్న‌ట్లు తెలిపింది.

కాగా క‌రోనా వైర‌స్‌కు ముందు ఐపీఎల్‌లో పాల్గొనేందుకు చెన్నై సూప‌ర్‌కింగ్స్  జ‌ట్టు అంద‌రికంటే ముందే ట్రైనింగ్ క్యాంప్‌ను ప్రారంభించింది. జ‌ట్టులో సీనియ‌ర్ ఆట‌గాళ్లైనా సురేశ్ రైనా, ఎంఎస్ ధోని , అంబ‌టి రాయుడు త‌మ ప్రాక్టీస్‌ను కూడా ప్రారంభించారు. అయితే క‌రోనా వైర‌స్ విజృంభించ‌డంతో మార్చి 29న ప్రారంభం కావాల్సిన ఐపీఎల్ కాస్త వాయిదా ప‌డింది. ఒక ద‌శ‌లో ఐపీఎల్ జ‌ర‌గుతుందా అన్న అనుమానం కూడా క‌లిగింది. కానీ టీ20 ప్ర‌పంచ‌క‌ప్ వాయిదా ప‌డ‌డంతో ఐపీఎల్‌కు మార్గం సుగ‌మ‌మ‌యింది. సెప్టెంబ‌ర్ 19 నుంచి దుబాయ్ వేదిక‌గా ఐపీఎల్ 13వ సీజన్‌ను నిర్వ‌హిస్తున్న‌ట్లు ఐపీఎల్ చైర్మ‌న్ బ్రిజేశ్ ప‌టేల్ పేర్కొన్నారు. 53 రోజుల పాటు జ‌ర‌గ‌నున్న ఐపీఎల్ 13వ సీజ‌న్ ఫైన‌ల్ మ్యాచ్ న‌వంబ‌ర్ 10వ తేదీన జ‌ర‌గ‌నుంది.

దుబాయ్‌లో జ‌ర‌గ‌నున్న ఐపీఎల్ 13వ సీజ‌న్‌కు సంబంధించిన షెడ్యూల్‌, మ్యాచ్‌ల వివ‌రాల‌ను ఆదివారం(ఆగ‌స్టు 2) జ‌రిగే ఐపీఎల్ గ‌వ‌ర్నింగ్ స‌మావేశంలో ప్ర‌క‌టించ‌నున్నారు. దీంతో పాటు ఐపీఎల్ పాల్గొన‌నున్న ఎనిమిది జ‌ట్ల‌కు సంబంధించి ఎక్క‌డ ఉండాల‌నేదానిపై, లీగ్‌లో పాల్గొనే ఆట‌గాళ్లకు ఏ విధ‌మైన భ‌ద్ర‌త క‌ల్పించాల‌నేదానిపై కూడా నిర్ణ‌యం తీసుకోనున్నారు. ‌  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top