నితీశ్‌రెడ్డిపై అగార్కర్‌ ప్రశంసలు! | Ajit Agarkar Praises Nitish-Kumar-Reddy Crucial For 2027-ODI World Cup | Sakshi
Sakshi News home page

తెలుగు క్రికెటర్‌ నితీశ్‌రెడ్డిపై అగార్కర్‌ ప్రశంసలు!

May 19 2026 8:10 PM | Updated on May 19 2026 10:03 PM

Ajit Agarkar Praises Nitish-Kumar-Reddy Crucial For 2027-ODI World Cup

అఫ్గానిస్తాన్‌తో టెస్టు, వన్డే సిరీస్‌కు సంబంధించి బీసీసీఐ మంగళవారం భారత జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆఫ్గన్‌తో జరగనున్న ఏకైక టెస్టు మ్యాచ్‌కు సంబంధించి తెలుగు క్రికెటర్‌ నితీశ్‌కుమార్‌ రెడ్డి  తన స్థానాన్ని నిలుపుకున్నాడు. ఈ నేపథ్యంలో సెలెక్షన్‌ కమిటీ హెడ్‌ అగార్కర్‌ నితీశ్‌ రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించాడు. 

ప్రస్తుతం ఉన్న ఆల్‌రౌండర్లలో నితీశ్‌కుమార్‌ ది బెస్ట్‌ అని, అతడి పురోగతి అద్భుతంగా ఉందని తెలిపాడు. రాబోయే రోజుల్లో టీమిండి యాలో నితీశ్‌కుమార్‌ కీలకం కానున్నాడనంటూ పేర్కొన్నాడు. ‘నితీశ్‌కుమార్‌ రెడ్డి ప్రస్తుతం టీమిండియాకు కీలకంగా మారిపోయాడు. ఈ మధ్య కాలంలో ఆటలో అతడు సాధించిన పురోగతి పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము. 

రాబోయే కొద్ది నెలల్లో జరగబోయే సిరీస్‌లకు అతడి ఎంపిక చేయాలని నిర్ణయించాయి. ముఖ్యంగా వచ్చే ఏడాది జరగనున్న వన్డే ప్రపంచకప్‌కు ముందు నితీశ్‌కు వీలైనన్ని ఎక్కువ అవకాశాలు కల్పించాలని భావిస్తున్నాం’ అని అగార్కర్‌ వెల్లడించాడు.

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణానికి చెందిన నితీశ్‌కుమార్‌ రెడ్డి సంప్రదాయ టెస్టు క్రికెట్‌లో మంచి గుర్తింపు సాధించాడు. ఇప్పటివరకు 10 టెస్టులాడిన నితీశ్‌ రెడ్డి 396 పరుగులు సాధించడంతో పాటు బౌలింగ్‌లో 8 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఒక సెంచరీ ఉంది. ఇక 4 వన్డేలు, 4 టీ20లు ఆడిన నితీశ్‌ రెడ్డి ఆల్‌రౌండర్‌ కోటాలో టీమిండియాలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకునే పనిలో ఉన్నాడు. 

ఈ నేపథ్యంలో ఇప్పటివరకు టీమిండియాకు కీలక ఆల్‌రౌండర్‌గా ఉన్న హార్దిక్‌ పాండ్యా స్థానానికి నితీశ్‌ రూపంలో ఎసరు పడినట్లే. ఇప్పటికీ పాండ్యా ప్రదర్శన అంతరంతమాత్రంగానే ఉంది. అగార్కర్‌ మాటలను బట్టి చూస్తే రాబోయే కాలంలో నితీశ్‌కుమార్‌ రెడ్డి ఆల్‌రౌండర్‌గా మూడు ఫార్మాట్లలోనూ (టెస్టు, వన్డే, టీ20) కీలక ఆటగాడిగా మారిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.

ప్రస్తుతం ఐపీఎల్‌ 2026 సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌కు ఆడుతున్న నితీశ్‌కుమార్‌ రెడ్డి ఆల్‌రౌండర్‌ పాత్రకు న్యాయం చేస్తున్నాడు. ఈ సీజన్‌లో 12 మ్యాచ్‌లాడిన నితీశ్‌రెడ్డి 235 పరుగులు చేయడంతో పాటు బౌలింగ్‌లో ఏడు వికెట్లు తీశాడు. ఇక ఎస్‌ఆర్‌హెచ్‌ ఈ సీజన్‌లో ఇప్పటికే ప్లేఆఫ్స్‌ బెర్తును ఖరారు చేసుకుంది. 

ఎస్‌ఆర్‌హెచ్‌ తమ చివరి లీగ్‌ మ్యాచ్‌ను సొంతగడ్డపై మే 22న ఆర్సీబీతో ఆడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి లీగ్‌ టాపర్‌గా ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టాలని ఎస్‌ఆర్‌హెచ్‌ భావిస్తోంది.

చదవండి: టీమిండియాలోకి వైభవ్‌.. అగార్కర్ కీలక వ్యాఖ్యలు!

Advertisement
 
Advertisement
Advertisement