● అక్రమ అరెస్టులతో అణచివేత తగదు ● జేఏసీ నాయకుల స్పష్టీకరణ
చేర్యాల(సిద్దిపేట): చేర్యాల రెవెన్యూ డివిజన్ సాధించితీరుతామని, అక్రమ అరెస్టులతో అణచివేత తగదని జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. డివిజన్ ఏర్పాటు చేయాలని కోరుతూ గురువారం జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన అసెంబ్లీ ముట్టడికి చేర్యాల, మద్దూరు, కొమురవెల్లి, దూల్మిట్ట మండలాల పరిధిలోని పలు గ్రామాల నాయకులు తరలివెళ్లారు. ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపేందుకు వెళ్లిన వారందరినీ పోలీసులు అరెస్టు చేసి సమీపంలోని పలు పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తమ ప్రాంత చిరకాల కోరిక అయిన చేర్యాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు అంశాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లేందుకు వచ్చిన తమను అక్రమంగా అరెస్టు చేసి పోలీస్స్టేషన్లకు తరలించడం అన్యాయమన్నారు. అరెస్టయిన వారిలో జేఏసీ నాయకులు నర్సయ్య, మల్లారెడ్డి, బాల్నర్సయ్య, కరుణాకర్, వెంకట్రెడ్డి, యెల్లారెడ్డి, ఉపేంధర్రెడ్డి, సంతోష్, యాదగిరి, చందు, మల్లేశం తదితరులున్నారు.


