ప్రజాసేవే లక్ష్యం కావాలి
● సృజనాత్మకతతో ఆలోచించాలి
● గ్రూప్–1 అధికారులతో కలెక్టర్ హైమావతి
సిద్దిపేటరూరల్: విధినిర్వహణలో ప్రత్యేక దృష్టి సారించి సృజనాత్మకత ఆలోచనలతో ప్రజలకు సేవలు అందించాలని కలెక్టర్ హైమావతి మొదటి బ్యాచ్ గ్రూప్–1 అధికారులకు సూచించారు. గ్రూప్–1 అధికారులు జిల్లాలో రెండు రోజులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రభుత్వ పథకాల అమలు, గ్రామ పాలన వ్యవస్థల పనితీరును తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం కలెక్టరేట్లో వారు కలెక్టర్ను కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యటన మా సర్వీసులో జీవితాంతం గుర్తుండిపోయే అద్భుతమైన అనుభవమన్నారు. జిల్లా ప్రజలు, అధికారుల ఆతిథ్యం చాలా బాగుందని సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ భవిష్యత్తులో ఉద్యోగరీత్యా మంచి నాయకత్వ లక్షణాలు ఏర్పాటు చేసుకొని క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను, వాటి పరిష్కారాలను తెలుసుకొని ప్రజలకు మంచి సేవ అందించేందుకు కృషి చేయాలన్నారు. అనంతరం గ్రూప్ –1 అధికారులను కలెక్టర్ సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) అబ్దుల్ హమీద్, డీఆర్ఓ నాగరాజమ్మ, డీఆర్డిఓ జయదేవ్ ఆర్య, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.


