నాచగిరి అభివృద్ధికి అడుగులు
వర్గల్(గజ్వేల్): నాచగిరి అభివృద్ధిలో కీలకమైన మాస్టర్ప్లాన్ పునరుద్ధరణ ప్రయత్నాలు ఫలవంతమయ్యే దిశగా అడుగులు పడుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో రూ.80 కోట్లతో మాస్టర్ప్లాన్ అంటూ హడావిడి కొనసాగిందే తప్ప ఆచరణ జరగలేదు. దీనికి తోడు మాస్టర్ ప్లాన్ ఆశలో ఎలాంటి పనులు చేపట్టకపోవడంతో క్షేత్ర అభివృద్ధి కుంటుపడింది. పాలకులు మారడంతో మాస్టర్ ప్లాన్ పునరుద్ధరణపై ఆశలు చిగురించాయి. మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మాస్టర్ప్లాన్ పునరుద్ధరణ ప్రయత్నాలను ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ రవీందర్గుప్తా, ధర్మకర్తలు కొనసాగిస్తున్నారు. మరోవైపు ఆలయ అభివృద్ధిలో భాగంగా ఆలయ కార్యనిర్వహణాధికారి రంగాచారి వినతి మేరకు మంగళవారం దేవాదాయశాఖ స్థపతి వల్లినాయగం, కార్యనిర్వాహక ఇంజనీర్(ఈఈ) ఓంప్రకాశ్ నాచగిరి సందర్శించారు. శిథిలావస్థకు చేరిన పాత సత్రాలు తొలగించి, మాస్టర్ ప్లాన్కు అవరోధం లేకుండా వాస్తు ప్రకారం నూతన షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టేందుకు స్థపతి వల్లినాయగం, ఈఈ ఓంప్రకాశ్, ఈఓ రంగాచారితో కలిసి క్షేత్రస్థాయిలో స్థల పరిశీలన జరిపారు. షాపింగ్ కాంప్లెక్స్, జనరేటర్ గది నిర్మాణాలకు సంబంధించి వాస్తు పరమైన సూచనలు చేశా రు. అనంతరం వారు శ్రీలక్ష్మీనృసింహుని దర్శించుకు ని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారికి అర్చకులు స్వామివారి శేషవస్త్రం, ప్రసాదాలు అందజేశారు.
మాస్టర్ప్లాన్ పునరుద్ధరణకు కసరత్తు
నూతన షాపింగ్ కాంప్లెక్స్ కోసం వాస్తు పరిశీలన
నాచగిరీశుని సన్నిధిలో రాష్ట్ర దేవాదాయశాఖ స్థపతి, ఈఈ


