అక్కసుతోనే విమర్శలు
హుస్నాబాద్: తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రతిపక్షాలు ఓర్వలేక పోతున్నాయని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు విమర్శించారు. శనివారం హుస్నాబాద్లో సహచర మంత్రి పొన్నం ప్రభాకర్తో కలసి విలేకరులతో మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిందని, దాన్ని యుద్ధప్రాతిపదికన, గుండె ధైర్యంతో గాడిన పడేసేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. కంటోన్మెంట్, పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్కు మద్దతు తెలిపారని, మున్సిపల్ ఎన్నికల్లో సైతం సత్తా చాటుతామని మంత్రి పేర్కొన్నారు. బీఆర్ఎస్ హయాంలో చేసిన పాపాలు కడిగేందుకే సమయం సరిపోవడం లేదన్నారు. ప్రజలు సంతోషంగా ఉంటే జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. రైతు భరోసా కింద రూ.21 వేల కోట్లు రుణ మాఫీ చేశామన్నారు. రూ.22 వేల కోట్లతో 4.50 లక్షల ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తున్నామని తుమ్మల వివరించారు.
మార్చిలో ఆయిల్పామ్ ఫ్యాక్టరీ ప్రారంభం
నంగునూరు(సిద్దిపేట): అత్యాధునిక టెక్నాలజీతో సిద్దిపేట జిల్లా నర్మేటలో నిర్మించిన ఆయిపామ్ ప్యాక్టరీని మార్చి మొదటి వారంలో ప్రారంభిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అన్నారు. శనివారం నర్మేటలో నిర్మించిన ప్యాక్టరీని ఆయిల్ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, ఎండీ యాస్మిన్ బాషాతో కలసి ఆయన పరిశీలించారు. నర్మేట ప్యాక్టరీకి 120 మెట్రిక్ టన్నుల గెలలను ప్రాసెసింగ్ చేయగల సామర్ధ్యం ఉందన్నారు. అన్ని జిల్లాల నుంచి ఆయిల్ తెప్పించి ఇక్కడే ప్యాకింగ్ చేస్తారన్నారు. గెలల నుంచి వచ్చిన పిప్పితో నాలుగు మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసి ఫ్యాక్టరీ అవసరాలకు వాడుకుంటామని తెలిపారు. ప్యాక్టరీలో మూడు రోజుల పాటు రైతు మేళా నిర్వహిస్తామన్నారు. ఆయిల్పామ్ సాగు, విస్తీర్ణం పెంచాలన్నారు. కార్యక్రమలో ప్యాక్టరీ ఎండీ శ్రీకాంత్రెడ్డి, హార్టి, అగ్రికల్చర్ అధికారులు పాల్గొన్నారు.
ప్రజలు సంతోషంగా ఉంటే
ఓర్వలేక పొతున్నారు: తుమ్మల
మున్సిపల్ ఎన్నికల్లోనూ సత్తా చాటుతాం


