పుర పోరులో నేతల బిగ్ ఫైట్
జిల్లాలో హీటెక్కిన రాజకీయాలు ● ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకం
జిల్లాలో మున్సిపల్ పోరు తీవ్ర స్థాయికి చేరడంతో రాజకీయాలు హీటెక్కాయి. మరోవైపు ఈ ఎన్నికలు ఆయా పార్టీల అగ్రనేతలకు పెను సవాల్గా నిలిచాయి. ఈ నెల 11న పోలింగ్ జరగనుండటంతో ప్రచారం ఊపందుకుంది. పార్టీ గుర్తుతో జరిగే ఎన్నికలు కావడంతో ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. బీఆర్ఎస్ నుంచి మాజీ ముఖ్యమంత్రి, కల్వకుంట్ల చంద్రశేఖర్రావు (కేసీఆర్), మాజీ మంత్రి, తన్నీరు హరీశ్రావు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి, కాంగ్రెస్ నుంచి మంత్రి పొన్నం ప్రభాకర్, బీజేపీ నుంచి కేంద్ర మంత్రి బండి సంజయ్, మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావులు జిల్లా నుంచే ప్రాతినిధ్యం వహిస్తుండటం గమనార్హం. దీంతో గెలుపే లక్ష్యంగా
ముందుకు సాగుతున్నారు.
– సాక్షి,సిద్దిపేట
గజ్వేల్ నియోజకవర్గం నుంచి మాజీ సీఎం కేసీఆర్, హుస్నాబాద్ నుంచి రాష్ట్ర రవాణా శాఖమంత్రి పొన్నం ప్రభాకర్, దుబ్బాక నుంచి ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పుర ఎన్నికల్లో ఆ మూడు మున్సిపాలిటీలు ఆయా పార్టీలకు ప్రతిష్టాత్మకమే కానున్నాయి. ఆయా పార్టీలు ఇన్చార్జిలను నియమించారు. ఏ పార్టీ వారు.. ఆ పార్టీ గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి.
పురిటిగడ్డపై బీఆర్ఎస్కు పట్టు
బీఆర్ఎస్ పురిటిగడ్డ సిద్దిపేట. జిల్లాలో బీఆర్ఎస్కు ఎక్కువగా పట్టుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. గత మున్సిపల్ ఎన్నికల్లో గజ్వేల్, దుబ్బాక, హుస్నాబాద్, చేర్యాల మున్సిపాలిటీలను బీఆర్ఎస్ కై వసం చేసుకుంది. మాజీ సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, రింగ్ రోడ్, వెజ్, నాన్వెజ్ మార్కెట్లు,
అంతర్గత రోడ్లను అభివృద్ధి చేశారు. హరీశ్రావు నిత్యం ఆయా మున్సిపాలిటీల పార్టీ పరిశీలకులతో మాట్లాడుతూ.. ఎన్నికల ప్రచారంలో పాల్గొని అధికార పార్టీ హామీల బాకీపై ప్రజలకు వివరిస్తున్నారు. దుబ్బాక మున్సిపాలిటీని తిరిగి దక్కించుకునేందుకు ఎమ్మెల్యే ప్రభాకర్రెడ్డి ప్రజల మధ్యనే ఉంటూ ఎన్నికల ప్రచారాన్ని ఉధృతం చేశారు.
జోష్తో బీజేపీ..
లోకసభ ఎన్నికల్లో ఎంపీగా రఘునందన్ రావు విజయం సాధించడంతో బీజేపీ నేతలు జోష్తో ముందుకు సాగుతున్నారు. దుబ్బాక మున్సిపాలిటీపై మెదక్ లోకసభ సభ్యుడు రఘునందన్ రావు ప్రత్యేక దృష్టి పెట్టారు. గత మున్సిపల్ ఎన్నికల్లో కేవలం ఒక్క కౌన్సిలర్ మాత్రమే విజయం సాధించారు. గతంలో దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ ఎలా విజయం సాధించిందో అదే విదంగా మున్సిపాలిటీని కై వసం చేసుకోవాలని ఆ పార్టీ నేతలు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
మంత్రికి పెనుసవాల్..
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క హుస్నాబాద్ నియోజకవర్గంలోనే కాంగ్రెస్ విజయం సాధించింది. ఎమ్మెల్యేగా గెలుపొందిన ప్రభాకర్కు రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా పని చేస్తున్నారు. హుస్నాబాద్ పట్టణంలో పలు అభివృద్ధి పనులు చేస్తున్నారు. అలాగే ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేయించి తరగతులు ప్రారంభించారు. హుస్నాబాద్ మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగరవేయాలన్న లక్ష్యంతో పొన్నం విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. తాను మంత్రి అయిన తర్వాత పార్టీ గుర్తుతో మొదటిసారిగా జరుగుతున్న ఎన్నికలు కావడంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. అలాగే కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు తూంకుంట ఆంక్షారెడ్డి సొంత నియోజకవర్గం గజ్వేల్ కావడంతో ప్రత్యేక దృష్టి పెట్టారు.


