
బ్యాంకర్ల తిరకాసు
ఎఫ్డీ చేస్తేనే డాక్యుమెంటేషన్ అంటూ మెలిక
● అయోమయంలో ‘డెయిరీ’ లబ్ధిదారులు ● ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రూ. 8.40కోట్ల సబ్సిడీ విడుదల ● ఇప్పటివరకు గ్రౌండింగ్ అయింది 281 యూనిట్లే ● పట్టించుకోని ఉన్నతాధికారులు
సాక్షి, సిద్దిపేట: బ్యాంకర్లు తిరకాసు పెడుతుండటంతో ‘డెయిరీ’ లబ్ధిదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. రుణాలు ఇవ్వాల్సింది పోయి.. సబ్సిడీ మినహా రుణాన్ని ముందుగా ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డీ) చేస్తేనే డాక్యుమెంటేషన్ అంటూ మెలిక పెడుతున్నారు. దీంతో యూనిట్ మంజూరైనప్పటికీ ఎఫ్డీ చేయకపోవడంతో గ్రౌండింగ్ కావడం లేదు. ఎస్సీ కార్పొరేషన్లో 2020–21కు సంబంధించి 600 యూనిట్లకు రూ.8.40కోట్లు మంజూరయ్యాయి. ఇప్పటి వరకు 281 యూనిట్లు గ్రౌండింగ్ కాగా 4.46కోట్ల సబ్సిడీ డబ్బులు లబ్ధిదారుల అకౌంట్లలో మూలుగుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి యూనిట్లు గ్రౌండింగ్ అయ్యేలా చూడాలని లబ్ధిదారులు కోరుతున్నారు.
జిల్లాలో పాడి పరిశ్రమ అభివృద్ధితో పాటు, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు డెయిరీ యూనిట్లను ఎస్సీ కార్పొరేషన్ మంజూరు చేసింది. 2020–21లో 978 డెయిరీ యూనిట్లు మంజూరు కాగా 600 యూనిట్లకు రూ 8.40కోట్ల సబ్సిడీ విడుదలయ్యాయి. ఒక్కో యూనిట్ విలువ రూ. 2లక్షలు. అందులో ప్రభుత్వం నుంచి రూ.1.40 లక్షలు (70శాతం) సబ్సిడీ, లబ్ధిదారుడి వాటా బ్యాంక్ నుంచి రుణం రూ.60 వేలు (30శాతం) అందించాలి. ఇప్పటి వరకు 281 యూనిట్లను పంపిణీ చేశారు. ఒక్కో యూనిట్లో రెండు పాడి పశువులు అందించారు. ఇంకా 319 యూనిట్లు గ్రౌండింగ్ కాకపోవడంతో రూ.4.46 కోట్లు బ్యాంక్లోనే నిల్వ ఉన్నాయి.
బెజ్జంకిలోనే అధికం
ప్రభుత్వం నిధులు మంజూరు చేసి గ్రౌండింగ్ కోసం లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లలో సబ్సిడీ డబ్బులను జమ చేసింది. గ్రౌండింగ్ చేయకుండా బ్యాంకర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. రెండేళ్లుగా లబ్ధిదారులు బ్యాంక్ల చుట్టూ తిరుగుతున్నా రుణాలు మంజూరు చేయడంలేదు. బెజ్జంకి మండలంలోని కేడీసీసీ బ్యాంక్లో దాదాపు 80 మంది లబ్ధిదారుల సబ్సిడీ డబ్బులు గతంలోనే జమ అయ్యాయి. ఇదే బెజ్జంకి కేడీసీసీ బ్యాంక్ వారు గతంలో రుణం డబ్బులు ఎఫ్డీ చేస్తేనే యూనిట్ను గ్రౌండింగ్ చేశారు.
నిబంధనలకు విరుద్ధంగా వెళ్లొద్దు
ప్రభుత్వ గైడ్లైన్స్కు విరుద్ధంగా బ్యాంకర్లు ముందుకు వెళ్లవద్దు. ఎస్సీ కార్పొరేషన్ డెయిరీ యూనిట్ల మంజూరుపై బ్యాంక్ మేనేజర్లతో టెలికాన్ఫరెన్స్ను నిర్వహిస్తాను. బ్యాంకర్లు రుణాలు ఇవ్వని పక్షంలో వెంటనే సబ్సిడీ డబ్బులను ఎస్సీ కార్పొరేషన్కు రిటర్న్ చేయాలని ఆదేశిస్తాను.
– హరిబాబు, లీడ్ బ్యాంక్ మేనేజర్
మాకొద్దు యూనిట్లు
బ్యాంకర్లు పెట్టే ఇబ్బందులు.. మరో పక్కన తీసుకవచ్చిన పాడి పశువులతో సరిగా పాల ఉత్పత్తి రాకపోవడంతో మాకు వద్దు యూనిట్లు అంటూ రద్దు కోసం ఎస్సీ కార్పొరేషన్లో లేఖలను అందిస్తున్నారు. హర్యానా నుంచి పాడి పశువులు కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిబంధన పెట్టింది. దీంతో అక్కడి నుంచి కొనుగోలు చేసి తీసుకవచ్చిన పాడి పశువులు ఇక్కడి వాతావరణానికి సరిగా అలవాటు పడటం లేదు. దీంతో పాలు తక్కువగా ఇస్తున్నాయని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లోకల్ అయిన, ఆంధ్రప్రదేశ్లోనైనా కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వం వెసులుబాటు కల్పించాలని, బ్యాంకర్లే రుణం ఇవ్వాలని లబ్ధిదారులు కోరుతున్నారు.

బ్యాంకర్ల తిరకాసు

బ్యాంకర్ల తిరకాసు