
రైతుకు మద్దతు
● ఎంఎస్పీ పెంపుతో పలు పంటల సాగుపై ప్రభావం ● కొద్ది కాలంగా తగ్గుతున్నపప్పు, నూనె పంటల సాగు ● జిల్లాలో పప్పుధాన్యాలు, నూనె పంటల విస్తీర్ణం అధికం ● పత్తి పెరుగుదలతో వాటిపై ప్రభావం
కేంద్ర ప్రభుత్వం కొన్ని కనీస మద్దతు ధర పెంచడంతో జిల్లా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొద్దికాలంగా జిల్లాలో పత్తి సాగు ప్రభావంతో పప్పుధాన్యాలు, నూనె పంటల సాగు విస్తీర్ణం కొన్నేళ్లుగా తగ్గిపోతున్న తరుణంలో కేంద్రం నుంచి వచ్చిన ఎంఎస్పీ పెంపు నిర్ణయం ఈపంటలు సాగు విస్తీర్ణం పెరిగేందుకు దోహపడనుంది.
నారాయణఖేడ్: కేంద్ర ప్రభుత్వం రైతులకు తీపి కబురు అందిస్తూ 14 రకాల పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) పెంచుతూ తీసుకున్న నిర్ణయంతో జిల్లాలోని రైతులకు మేలు చేకూరనుంది. ముఖ్యంగా పప్పుదినుసుల సాగుకు ఈ పెంపు ఉపయుక్తంగా మారనుంది. జిల్లాలో ఆయా రకాల పంటలసాగు విస్తీర్ణాలపై ఈ ధర పెంపు ప్రభావం చూపనుందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. జిల్లాలో అత్యధికంగా పత్తిపంటను సాగు చేస్తున్నారు. ఏటికేడు పత్తి పంట సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతూ వస్తోంది. ఈ పంట విస్తీర్ణం పెంపు ఇతర పంటలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. తిండిగింజలపై అధిక ప్రభావమే చూపింది. గతేడాది ఖరీఫ్లో 1,42,634.92 హెక్టార్లలో పత్తిపంటను సాగు చేయగా ఈ ఏడాది 1.43,817.81హెక్టార్లలో సాగు జరగనుందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. అదేవిధంగా వరి గతేడాది 60,792.41హెక్టార్లలో సాగు కాగా ఈసారి 59,424.7హెక్టార్లుగా నిర్ధారించారు. గతేడాది కంది పంట 31,218.77 హెక్టార్లు సాగుచేయగా ప్రస్తుతం 32,044.53హెక్టార్లుగా అంచనా వేశారు. వీటితోపాటు ఇతర నూనె, ఇతర పంటల సాగు విస్తీర్ణం పెరుగుతుందని భావిస్తున్నారు. జిల్లాలో నారాయణఖేడ్, జహీరాబాద్, అందోల్ నియోజకవర్గాల్లో అత్యధికంగా పప్పు దినుసులు, నూనె గింజల సాగు జరుగుతుండగా సంగారెడ్డి నియోజకవర్గంలో మోస్తారుగా పప్పు దినుసులు వేస్తారు. ఏడెనిమిదేళ్లుగా పప్పుదినుసులు సాగు గణనీయంగా పడిపోతూ పత్తిపంట సాగు విస్తీర్ణం భారీగా పెరుగుతోంది. నూనెగింజలు, జొన్న తదితర పంటలపై కూడా పత్తిపంట పెంపు ప్రభావం భారీగానే ఉంది.
వరిపై ప్రభావం చూపనుందా
మద్దతు ధర పెంపులో భాగంగా కేంద్రం పత్తి పంటకు కూడా ధరను పెంచింది. పత్తికి ధర పెరుగుదల వరి పంటపై ప్రభావం చూపే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. పత్తి పంట నీటి తడులు తక్కువగా అవసరం కాగా వరితో పొలిస్తే పత్తి పంటకు పెట్టుబడులు కూడా కొంత తక్కువగా ఉండనున్నాయి. బీటీ రకాల పత్తి పంటలు కావడంవల్ల దిగుబడులు పెరగడం, పంట కోత సమయాల్లో ధర అధికంగా లభించగలదనే భావన రైతుల్లో ఉంది.
నూనె, పప్పు ధాన్యాల సాగు పెంపుకోసం
నూనె గింజలు, పప్పుధాన్యాలు, పోషక తృణధాన్యాల పంటలను ప్రొత్సహించనున్నట్లు కేంద్రం తెలిపింది. కంది, పెసర, మినుము, జొన్న, మొక్కజొన్న, సోయాబీన్, పొద్దుతిరుగుడు పంటల విస్తర్ణంతోపాటు తృణధాన్యాల సాగు కాస్త పెరిగే అవకాశముందని వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఈ సారి పప్పుధాన్యాలు, నూనె గింజల పెంపును అధికంగా రైతులు చేపట్టేలా ప్రొత్సహించనున్నట్లు చెబుతున్నారు. గతేడాది మద్దతు ధరకంటే బయటి మార్కెట్లో కంది, పెసర, మినుము ధరలు అధికంగా ఉన్నాయి. నాలుగైదేళ్లుగా ఈ పప్పు ధాన్యాల ధరలు బయటి మార్కెట్లోనే అధికంగా ఉంటున్నాయి. ఈ పంటలకు కేంద్రం తాజాగా మద్దతు ధర పెంచిన నేపథ్యంలో వీటి సాగు కూడా పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
ఎంఎస్పీ పెంపు, జిల్లాలో పలు ప్రధాన పంటల సాగు విస్తీర్ణం
పంట 2024– 25 2025– 26 పెంపు రూ.సాగు విస్తీర్ణం
(హెక్టార్లలో)
పత్తి మీడియం 7,121 7,710 589
పత్తి పొడుగు పంజ 7,521 8,110 589 1,43,817.81
వరి కామన్ 2,300 2,369 69 59,424.7
కంది 7,550 8,000 450 32,044.53
పెసర 8,682 8,768 86 57,49.39
మినుము 7,400 7,800 400 3,465.59
జొన్న 3,371 3,699 328 237.25
సోయాబీన్ 4,892 5,328 436 29,817.81
పొద్దుతిరుగుడు 7,280 7,721 441 8.3
నువ్వులు 9,267 9,846 579 18.62