
నిధులున్నా కాల్వ పనులు చేపట్టరా..?
సీపీఐ నేత చాడ
అక్కన్నపేట(హుస్నాబాద్): రేగొండలోని గౌరవెల్లి ప్రాజెక్టు ఎడమ కాలువ నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం ఎడమ కాల్వ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవతో రాష్ట్ర ప్రభుత్వం కాల్వ నిర్మాణానికి రూ.437 కోట్లు మంజూరు చేసిందన్నారు. నిధులు మంజూరై నెలలు గడుస్తున్నా ఇంతవరకు కాల్వ నిర్మాణ పనులు ఎందుకు ముందుకెళ్లడం లేదని ప్రశ్నించారు. ప్రాజెక్టు పూర్తయి కాల్వను నిర్మించకపోతే ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోయిన నర్సింగ్ తండా, మల్చేరువు తండాలోని గిరిజనుల సమస్యలు పరిష్కరించాలని కోరారు.
పాఠశాలల ప్రారంభానికి సన్నద్ధం
అదనపు కలెక్టర్ గరిమా ఆదేశం
సిద్దిపేటరూరల్: పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్న నేపథ్యంలో తరగతి గదులను శుభ్రంగా చేసి ఎటువంటి సమస్యలు లేకుండా చూడాలని అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని తన చాంబర్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ జూనియర్ కళాశాలలోని ఏర్పాట్లపై ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా గరీమా మాట్లాడుతూ.. యూనిఫాంలు ఆలస్యం కాకుండా విద్యార్థులకు అందించేలా చూడాలన్నారు. అల్పాహారం, భోజనం ప్రభుత్వం నిర్ణయించిన నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ అందించాలని చెప్పారు. పాఠశాలల పునఃప్రారంభం నాటికి ఎక్కడ విద్యుత్, ఇతర రిపేర్లు లేకుండా చూసుకోవాలని, అదనంగా అవసరమైన వాటి నివేదిక అందించాలని కోరారు. అన్ని ప్రభుత్వ రెసిడెన్షియల్ విద్యాలయాల్లో హార్వెస్టింగ్ పిట్, బోర్ వెల్ రీచార్జీ, రెయిన్ వాటర్ రీచార్జీల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్డీఓ జయదేవ్ ఆర్య, బీసీ సంక్షేమ శాఖ అధికారి నాగరాజమ్మ, డీఈఓ శ్రీనివాస్ రెడ్డి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యాలయాల, సంబంధిత శాఖల అధికారులు, పాల్గొన్నారు.
మినీ స్టేడియానికి
కరువైన పర్యవేక్షణ
హుస్నాబాద్: క్రీడాకారుల కోసం నిర్మించిన మినీ స్టేడియంపై అధికారుల పర్యవేక్షణ కరువైందని బీఆర్ఎస్ నియోజకవర్గ అధికార ప్రతినిధి మల్లికార్జున్రెడ్డి అన్నారు. మినీ స్టేడియంలో క్రీడలు ఆడుకునేందుకు సరైన సౌకర్యం లేక గడ్డి పెరిగి పోయిందన్నారు. అలాగే ఇండోర్ స్టేడియం కిటికీలు, షటిల్ కోర్టులోని చెక్క మ్యాట్ పగిలి పోయిందన్నారు. మరమ్మతులు చేపట్టి క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకురావాలని కోరాడు.

నిధులున్నా కాల్వ పనులు చేపట్టరా..?