
ఇంటింటికీ ఉపాధ్యాయులు
జిల్లాలో నేటి నుంచి బడిబాట
● ఈ నెల 19 వరకు ప్రత్యేక కార్యక్రమాలు ● సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్య పెంచడమే లక్ష్యం ● గతేడాది 8,042 మంది చేరిక ● ఈసారి మరింత పెంచేలా కార్యాచరణ
ప్రశాంత్నగర్(సిద్దిపేట): సర్కారు బడులను బలోపేతం చేసేందుకు బడిబాట కార్యక్రమం చేపడుతున్నారు. జిల్లాలో శుక్రవారం నుంచి ఈ నెల 19 వర కు కొనసాగనుంది. ఇందులో భాగంగా ప్రతి రోజు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కార్య క్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారులు అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, హాస్టల్ వార్డెన్లు, విద్యార్థుల తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులు పాల్గొననున్నారు. గత ఏడాది బడిబా ట ద్వారా 8,042 మంది విద్యార్థులు పాఠశాలల్లో చేరారు. ఈసారి ఈ సంఖ్యను మరింతగా పెంచేలా విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు.
కార్యక్రమాల నిర్వహణ ఇలా..
గ్రామస్థాయిలో సమావేశాలు నిర్వహించి బడిబాట నమోదు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. బడిబాటపై అవగాహన ర్యాలీ, బడీడు పిల్లలను గుర్తించే కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇంటింటికీ వెళ్లి బడీడు పిల్లల జాబితాను సిద్ధం చేసి, గ్రామ విద్యార్థి రిజిస్టర్లో నమోదు చేస్తారు. అలాగే అంగన్వాడీ, ప్రత్యేక అవసరాలు ఉన్న చిన్నారులను ఈ కార్యక్రమం ద్వారా గుర్తించనున్నారు. వీరిని భవిత కేంద్రాలు, ప్రత్యేక వనరుల కేంద్రాలలో పేర్లను నమోదు చేయనున్నారు.
పాఠశాలలు ప్రారంభం అయ్యాక..
ఈ నెల 12న నూతన విద్యాసంవత్సరం ప్రారంభం కానుంది. పాఠశాలను సుందరంగా అలంకరించనున్నారు. అదేవిధంగా విద్యార్థులకు పాఠ్యపుస్తకా లు, నోట్బుక్స్, యూనిఫాంలు పంపిణీ చేయనున్నారు. గతేడాది పాఠశాల హాజరు, విద్యా ప్రదర్శ న, సహపాఠ్య, సహాయ కార్యక్రమాలు, క్రీడలు మొదలైన వాటిలో మంచి ప్రదర్శన చూపిన విద్యా ర్థులకు బహుమతులు అందించనున్నారు.
సామూహిక అక్షరాభ్యాసాలు
నూతనంగా పాఠశాలల్లో చేరిన విద్యార్థులకు ఈ నెల 13న సామూహిక అక్షరాభ్యాసాలు చేయించనున్నారు. అదేవిధంగా మిగతా విద్యార్థులకు క్రీడా పోటీలు, క్విజ్ పోటీలు, నైపుణ్య పరీక్షలు, చిత్రలేఖనం, నాటకాలు నిర్వహిస్తారు. డిజిటల్ విద్యాభ్యాసం కోసం ప్రత్యేక ఏర్పాట్లు, కిచెన్ గార్డెన్, బాలసభ నిర్వహణ, పాఠశాల స్థాయి సమావేశాలు నిర్వహించనున్నారు.
విద్యార్థుల సంఖ్య పెంచుతాం
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. ప్రతి ఏటా బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని రకాల మౌలిక సౌకర్యాలు, ఏఐ ద్వారా నాణ్యమైన విద్యను అందిస్తున్నాం. తల్లిదండ్రులు తమ పిల్లలను దగ్గరలోని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి. – రంగనాథ్,
కమ్యూనిటీ మొబిలైజింగ్ అధికారి, సిద్దిపేట
బాలికలకు కూడా..
బాలురే కాకుండా బాలికలకు కూడా సమానంగా విద్యను అందించే విధంగా రోజు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. బాలికలకు మార్గదర్శకత, ఇతర అంశాలపై అవగాహన కల్పించనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివి వివిధ రంగాల్లో రాణిస్తున్న బాలికలు, మహిళలను సన్మానించనున్నారు.