మల్లన్నా.. కోడెలకు దిక్కెవరు? | - | Sakshi
Sakshi News home page

మల్లన్నా.. కోడెలకు దిక్కెవరు?

Jun 6 2025 7:38 AM | Updated on Jun 6 2025 7:38 AM

మల్లన

మల్లన్నా.. కోడెలకు దిక్కెవరు?

కొమురవెల్లి ఆలయంలో గోశాల లేక అవస్థలు
● మూడేళ్లలో 100 కోడెలను అందజేసిన భక్తులు ● చేసేదిలేక ప్రైవేట్‌కు 81 కోడెలు ● తాత్కాలిక షెడ్‌లో 15 పశువుల సంరక్షణ ● ప్రత్యేక గోశాల ఏర్పాటు చేయాలంటున్న భక్తులు

తెలంగాణలోనే ప్రముఖ పుణ్యక్షేత్రాలలో కొమురవెల్లి మల్లికార్జున స్వామి దేవాలయం ఒకటి. భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతోంది. స్వామివారికి ఎక్కువగా పట్నాలు, బోనాలు, అభిషేకాలు, కల్యాణోత్సవంతో మొక్కులు తీర్చుకుంటారు. అలాగే కొందరు కోడెలను సమర్పిస్తుంటారు. అయితే వీటి సంరక్షణ ఆలయ నిర్వాహకులకు కష్టంగా మారుతోంది. ఇందుకు కారణం ప్రత్యేక గోశాల లేకపోవడమే. – సాక్షి, సిద్దిపేట

తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, కర్ణాటక నుంచి కొమురవెల్లికి భక్తులు భారీగా తరలివస్తారు. దేవుడి మొక్కుల కింద కోడెలను ఆలయానికి సమర్పించడం ఏళ్లుగా కొనసాగుతోంది. అలాగే కొందరు కోడెలు కడతామని మొక్కుతారు. దేవాలయానికి రూ.200 చెల్లించి టోకెన్‌ తీసుకుని అక్కడే ఉన్న కోడెను గుడికి సమీపంలో కట్టేస్తారు.

ట్రస్ట్‌కు కోడెలు

కోడెల నిర్వహణ భారంగా ఉండటంతో ఓ ప్రైవేట్‌ ట్రస్ట్‌కు అప్పగిస్తూ చేతులు దులుపుకొంటున్నారు. కోడెలను ప్రైవేట్‌ గోశాలకు ఇస్తుండటంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోడెలను నిర్వహణ చేయకపోతే ఎలా అని అంటున్నారు. దేవాలయానికి గత మూడేళ్లలో 100 కోడెలు భక్తులు సమర్పిస్తే వాటిలో 81 కోడెలు ప్రైవేట్‌ ట్రస్ట్‌కు అప్పగించడం గమనార్హం. నాలుగు కోడెలు మృతిచెందాయి. దేవాలయ సమీపంలోని తాత్కాలిక షెడ్‌లో 15 కోడెలను సంరక్షిస్తున్నారు. వేములవాడలో కోడెలు మృతిచెందుతుండటంతో కొమురవెల్లిలో ఎలా ఉన్నాయోనని భక్తులు ఆందోళన చెందుతున్నారు

షెడ్‌లో నిర్వహణ

దేవాలయం సమీపంలోని ఒక షెడ్‌లో కోడెలను సంరక్షిస్తున్నారు. తక్కువ స్థలంలో షెడ్‌ ఉండటంతో కొన్నింటినే ఉంచుతున్నారు. దేవాలయానికి ప్రతీ ఏటా కోట్లాది రూపాయల ఆదాయం వస్తుంది. అలాగే దాదాపు 150 ఎకరాలకు పైగా స్థలం ఉంది. ఆ స్థలాల్లో కొంత భాగం గోశాల నిర్మాణం చేయాలని భక్తులు కోరుతున్నారు. అలాగే ఆలయ సమీపంలో గోపూజ చేసుకునేందుకు మండపం ఏర్పాటు చేయాలన్న విన్నపాలు వస్తున్నాయి. ఇప్పటకై నా దేవాదాయ శాఖ, ప్రజాప్రతినిధులు స్పందించి ప్రత్యేక గోశాలను నిర్మించాలని, కోడెలను ప్రైవేటుకు అప్పగించకుండా చూడాలని భక్తులు కోరుతున్నారు.

అనుమతి కోరుతాం

దేవాలయాలనికి సంబంధించిన ఎకరం భూమిలో గోశాల ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. అనుమతి కోసం ఉన్నతాధికారులకు లేఖ రాస్తాం. అనుమతి రాగానే నిర్మాణం ప్రారంభిస్తాం. తోట బావి లేదంటే, కమాన్‌ దగ్గర, లేక మెయిన్‌ రోడ్‌ దగ్గర స్థలంలో నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. ప్రస్తుతం ఉన్న కోడెలను సంరక్షిస్తున్నాం.

–అన్నపూర్ణ, ఈఓ, కొమురవెల్లి దేవాలయం .

కోడెల వివరాలిలా..

సంవత్సరం వచ్చిన గోవులు ట్రస్ట్‌కు ఇచ్చినవి చనిపోయినవి

2023 16 – –

2024 54 61 03 4 జూన్‌ 2025 30 20 01

మల్లన్నా.. కోడెలకు దిక్కెవరు?1
1/1

మల్లన్నా.. కోడెలకు దిక్కెవరు?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement