
రైతు మహోత్సవంలో భాగస్వాములు కావాలి
● కలెక్టర్ మనుచౌదరి ● కిసాన్ మేళా ఏర్పాట్ల పరిశీలన ● నేటి నుంచి షురూ..
హుస్నాబాద్: వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు, అధిక దిగుబడులు, రాబడిని సాధించేలా మెలకువలను తెలుసుకోవడానికి రైతు మహోత్సవంలో పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని కలెక్టర్ మనుచౌదరి పిలుపు నిచ్చారు. పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఈ నెల 6, 7, 8 తేదీల్లో నిర్వహించే కిసాన్ మేళా ఏర్పాట్లను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ సిద్దిపేట, కరీంనగర్, హన్మకొండ, జనగామ జిల్లాల నుంచి రైతులు వస్తున్నట్లు తెలిపారు. సాంకేతిక పరికరాలు, పరిజ్ఞానం, సాంకేతికతతో కూడిన వ్యవసాయం, వాణిజ్య పంటలు, ఆయిల్పామ్ పంటలు ఎలా పండించాలో వర్క్షాపు నిర్వహించనున్నట్లు తెలిపారు. రైతులే కాకుండా ఫార్మర్స్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్స్, శాస్త్రవేత్తలు, వ్యవసాయ కళాశాలల నుంచి ప్రొఫెసర్లు, వ్యవసాయ సంబంధిత కంపెనీల ప్రతినిధులు, వ్యవసాయ, ఉద్యాన, పట్టు పరిశ్రమ, పశుసంవర్ధక శాఖల అధికారులందరూ భాగస్వాములు అవుతారని తెలిపారు. నూతన సాంకేతికతపై రైతులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు.
సర్వం సిద్ధం
కిసాన్ మేళాకు సర్వం సిద్ధం చేసినట్లు కలెక్టర్ తెలిపారు. కార్యక్రమానికి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్లు ముఖ్య అతిథులుగా వస్తున్నారని తెలిపారు. వీరితో పాటుగా ఇతర ప్రజాప్రతినిధులు వస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) అబ్దుల్ హమీద్, ఆర్డీఓ రామ్మూర్తి, ఏసీపీ సదానందం, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్, జిల్లా మార్కెటింగ్ అధికారి సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
బియ్యం పంపిణీలో ఇబ్బందుల తలెత్తొద్దు
హుస్నాబాద్రూరల్: వర్షాకాలం దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం పేదలకు మూడు నెలల రేషన్ బియ్యం ఇకేసారి ఇస్తోందని కలెక్టర్ మనుచౌదరి తెలిపారు. గురువారం మహ్మదాపూర్లో జరుగుతున్న భూ భారతి రెవెన్యూ సదస్సును సందర్శించారు. అలాగే రేషన్ దుకాణాన్ని పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ జూన్, జూలై, ఆగస్టు నెలల రేషన్ బియ్యాన్ని జూన్ నెలలోనే ఇస్తున్నామని చెప్పారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా బియ్యం పంపిణీ చేయాలని డీలర్కు సూచించారు.