
పక్కాగా మూల్యాంకనం
సిద్దిపేటఎడ్యుకేషన్: ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం కచ్చితంగా, తప్పులు లేకుండా చేయాలని స్పాట్ వాల్యుయేషన్ క్యాంపు అధికారి, జిల్లా ఇంటర్ విద్యాధికారి రవీందర్రెడ్డి చెప్పారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల (కో ఎడ్యుకేషన్)లో ఏర్పాటు చేసిన మూల్యాంకన కేంద్రాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. అనంతరం మూల్యాంకన విధుల్లో పాల్గొనే అధ్యాపకులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు ఎక్కడ కూడా అన్యాయం జరగకుండా ఉండేందుకు బోర్డు అధికారులు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. గతంలో కంటే భిన్నంగా ఈ సారి రెండు బోర్డులకు ఒక చీఫ్ ఎగ్జామినర్ను నియామకం చేసినట్లు తెలిపారు. సీఈలు చాలా జాగ్రత్తగా ఉండాలని, ఏఈలు వాల్యు చేసిన పేపర్లను సీఈలు, ఎస్ఈలు ర్యాండమ్గా వాల్యు చేయాలని సూచించారు. ఈ క్రమంలో ఐదు కంటే ఎక్కువ మార్కుల వేరియేషన్ వస్తే చర్యలు ఉంటాయన్నారు. మూల్యాంకనంలో తప్పులు చేస్తే పెనాల్టీలు, షోకాజ్లు, రికవరీలు ఉంటాయన్నారు. మూల్యాంకన ప్రక్రియ మొత్తం సీసీ కెమెరాలతో పాటు ఇంటర్ బోర్డు కమాండ్ కంట్రోల్ రూమ్ పర్యవేక్షణలో ఉంటుందని, కాబట్టి జాగ్రత్తగా మూల్యాంకనం చేయాలని సూచించారు. చీఫ్ కోడింగ్ ఆఫీసర్ శ్రీనివాస్, ఏసీఓ జనరల్–1 సత్యనారాయణరెడ్డి, ఏసీఓ జనరల్–2 మంజుల, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్(ఎస్ఈ) శశిధర్రెడ్డి తదితరులు మూల్యాంకనంలో గతంలో జరిగిన పొరపాట్లపై సమీక్షించి, ప్రస్తుతం అవి జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు, సలహాలను అందించారు.
తప్పులు చేస్తే చర్యలు తప్పవు
జిల్లా ఇంటర్ విద్యాధికారి రవీందర్రెడ్డి