
మూల్యాంకనంలో నిర్లక్ష్యం తగదు
సిద్దిపేటఎడ్యుకేషన్: ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ మూల్యాంకనంలో నిర్లక్ష్యం తగదని, తప్పులు చేస్తే చర్యలు తప్పవని ఇంటర్ బోర్డు అబ్జర్వర్ భీమ్సింగ్ హెచ్చరించారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కొనసాగుతున్న జవాబు పత్రాల మూల్యాంకన కేంద్రాన్ని శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం మూల్యాంకన కేంద్రం అధికారి రవీందర్రెడ్డితో కలిసి అధ్యాపకులతో సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ గత మూల్యాంకనంలో జరిగిన పొరపాట్లను క్యాంపు అధికారుల దృష్టికి తెచ్చామని, అవి పునారావృతం కాకుండా చూసుకోవాలన్నారు. మూల్యాంకన కేంద్రం మొత్తం సీసీ కెమెరాల నిఘాలో ఉందని, హైదరాబాద్ ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ప్రతి అంశాన్ని గమనిస్తున్నట్లు చెప్పారు. అధ్యాపకులు ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా విద్యార్థుల జవాబు పత్రాలను ఒకటికి రెండు సార్లు పరిశీలించి మదింపు చేయాలని సూచించారు. క్యాంపు అధికారి, డీఐఈఓ రవీందర్రెడ్డి మాట్లాడుతూ అధ్యాపకులు నిబద్ధతతో పనిచేసి సిద్దిపేట మూల్యాంకన కేంద్రానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు.
నేటినుంచి రెండో విడత..
ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల జవాబు పత్రాల రెండో విడత మూల్యాంకనం శనివారం నుంచి ప్రారంభం అవుతుందని, క్యాంపు అధికారి, జిల్లా ఇంటర్ విద్యాధికారి(డీఐఈఓ) రవీందర్రెడ్డి చెప్పారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ ఫిజిక్స్, ఎకనామిక్స్, బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, కామర్స్ సబ్జెక్టుల అధ్యాపకులు మూల్యాంకన కేంద్రంలో ఉదయం 10గంటల లోగా రిపోర్టు చేయాలన్నారు. సిద్దిపేట, మెదక్ జిల్లాలలోని ప్రభుత్వ, అనుబంధ, ప్రైవేట్ కళాశాలల్లో పనిచేస్తున్న అధ్యాపకులు అందరూ తప్పనిసరిగా రిపోర్టు చేయాలన్నారు. రిపోర్టు చేయని వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పొరపాట్లు పునరావృతం కావద్దు
తప్పులు చేస్తే చర్యలు
ఇంటర్ బోర్డు అబ్జర్వర్ భీమ్సింగ్