
అర్హులందరికీ ఇళ్లు
ఆయిల్పామ్తో అధిక లాభాలు
హుస్నాబాద్: అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని, లబ్ధిదారుల ఎంపికలో అక్రమాలకు తావివ్వకుండా పారదర్శకంగా ఎంపిక చేసినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మున్సిపల్, ఆర్డీఓ కార్యాలయాలలో ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. అంతకుముందు మున్సిపల్ కార్యాలయ సమీపంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటి నమూనా గృహాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నియోజకవర్గంలో మొదటి విడతగా 3,500 ఇళ్లు మంజూరయ్యాయన్నారు. మరో రెండు నెలల్లో రెండో విడతగా ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు. వచ్చే నెల 9వ తేదీలోగా ముగ్గు పోసి ఇల్లు వేగంగా కట్టుకొని గృహ ప్రవేశం చేయాలన్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకే ఇళ్లు నిర్మించుకోవాలని సూచించారు. ఫ్రీ ఇసుక ట్రాక్టర్ కూపన్లు ఇస్తామన్నారు. డబ్బులు లేకపోతే మహిళా సంఘం నుంచి రూ.లక్ష రుణం ఇప్పిస్తాని తెలిపారు. గత పదేళ్లలో నియోజకవర్గంలో 1,420 ఇళ్లు మంజూరైతే కేవలం 240 ఇళ్లు మాత్రమే ఇచ్చారని తెలిపారు. హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు సుందరీకరణ, 150 పడకల ఆస్పత్రి నిర్మాణం, ఇంజనీరింగ్ కళాశాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కోహెడలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ రూ.200 కోట్లతో నిర్మిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ మనుచౌద
రి, అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్, ఆర్డీఓ రామూర్తి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ తదితరులు ఉన్నారు.
కోహెడలో 392 మందికి..
కోహెడ(హుస్నాబాద్): అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చి తీరుతామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం స్థానిక రైతు వేదికలో 392 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలతో పాటు మహిళా సంఘాల నుంచి మరో రూ.లక్ష రుణం ఇస్తున్నట్లు చెప్పారు. జూన్ 9 లోపు మంచి ముహూర్తాలు ఉన్నాయని.. ఇంటి నిర్మాణం పనులు ప్రారంభించాలని సూచించారు. అలాగే పోరెడ్డిపల్లిలో 91 ఇళ్లు పైలెట్ ప్రాజెక్టు కింద మంజూరు చేశామన్నారు. అంతకు ముందు తహసీల్దార్ కార్యాలయ సమీపంలో ఇందిరమ్మ నమూనా ఇల్లును ప్రారంభించారు.
హుస్నాబాద్రూరల్: ఆయిల్పామ్ సాగుతో అధిక లాభాలు వస్తాయని, నాలుగేళ్లు కష్టపడితే 30 ఏళ్ల వరకు ఆదాయం వస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం పోతారం(ఎస్)లో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు 12,335 ఎకరాల్లో ఆయిల్ పామ్ పంటను రైతులు సాగు చేస్తున్నారన్నారు. హుస్నాబాద్ ప్రాంతం భూములు అనుకూలంగా ఉంటాయని 5 ఎకరాలపై బడిన రైతులు సాగుకు ముందుకు రావాలన్నారు. అంతర పంటలను సైతం సాగు చేసుకోవచ్చని తెలిపారు. ఆయిల్పామ్ పంటను అకాల వర్షాలు, వడగళ్ల నష్టం చేయవని చెప్పారు. నర్మెట్టలోనే పరిశ్రమ ప్రారంభానికి సిద్ధం చేశామన్నారు. రైతులకు రవాణా భారం లేకుండా హుస్నాబాద్లో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయించి పైసా ఖర్చు లేకుండా ఫ్యాక్టరీకి తరలిస్తామన్నారు. రైతుల విజ్ఞప్తి మేరకు రెండో లైన్ డ్రిప్పు ఏర్పాటులో సబ్సిడీకి కృషి చేస్తామని చెప్పారు. గౌరవెల్లి ప్రాజెక్టు పనులు పూర్తి చేసి తీరుతామని, కొందరు కావాలని ప్రాజెక్టు పనులకు అడ్డుపడుతున్నారని మంత్రి తెలిపారు. గ్రీన్ ట్రిబ్యునల్ సమస్యలను అధిక మించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు.
ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక పారదర్శకం
నిబంధనల మేరకే ఇల్లు నిర్మించుకోవాలి
మంత్రి పొన్నం ప్రభాకర్

అర్హులందరికీ ఇళ్లు